(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ): చిన్నారులపై లైంగికదాడులు, వేధింపులపై పోక్సో చట్టం కింద నమోదైన కేసుల విచారణలో తెలంగాణ టాప్లో నిలిచింది. ఈ కేసుల పెండింగ్లో మాత్రం బీజేపీ పాలిత డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ర్టాలు అగ్రస్థానానికి చేరాయి. ఇటీవలి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. పోక్సో చట్టం కింద విచారణ చేసి నిందితులకు శిక్షపడేలా చేసిన రాష్ర్టాల్లో తెలంగాణ ముందువరుసలో ఉండగా, ఫాస్ట్ట్రాక్ కోర్టుల్లో విచారణకు అత్యధిక కేసులు పెండింగ్ ఉన్న రాష్ర్టాల లిస్టులో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర పైనున్నాయి.
ఈ రాష్ర్టాలు దోషులకు కఠిన శిక్ష వేయడంలో వెనుకబడ్డాయి. ఈ ఏడాది అక్టోబర్ వరకు దేశంలో మొత్తం 838 ఫాస్ట్ట్రాక్ కోర్టులు పనిచేస్తుండగా, 14 లక్షలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. బీజేపీ పాలిత సర్కార్ ఉన్న ఉత్తరప్రదేశ్లో 10,36,970 పోక్సో కేసులు, మహారాష్ట్రలో 1,52,312 పోక్సో కేసులు పెండింగ్లో ఉన్నట్టు కేంద్రం న్యాయ శాఖ తన నివేదికలో తెలిపింది. అదేవిధంగా, 10 రాష్ర్టాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఫాస్ట్ట్రాక్ కోర్టుల్లో ఎలాంటి పోక్సో కేసులు పెండింగ్లో లేవని పేర్కొన్నది. వీటిల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, కేరళ తదితర రాష్ర్టాలు ఉన్నట్టు వెల్లడించింది.