హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): చోరీకి గురైన లేదా పొరపాటున పోగొట్టుకున్న ఫోన్లను ట్రేస్ చేసి, వాటిని యజమానులకు అప్పగించడంలో తెలంగాణ పోలీసులు సత్తా చాటుతున్నారు. ఏకంగా 67.98 శాతం ఫోన్ల రికవరీతో రాష్ట్ర పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్టు సీఐడీ చీఫ్, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) సూపర్ యూజర్ మహేశ్ భగవత్ మంగళవారం వెల్లడించారు.
రాష్ట్రంలోని 780 పోలీస్ స్టేషన్లలో సీఈఐఆర్ను అమలు చేస్తున్నామని, ఈ విధానంతో కేవలం 110 రోజుల్లోనే 55,219 ఫోన్లను బ్లాక్ చేసి, 11,297 ఫోన్లను ట్రేస్ చేశామని, వాటిలో 5,118 ఫోన్లను యజమానులకు అప్పగించామని వివరించారు. ఈ జాబితాలో తెలంగాణ తర్వాత కర్ణాటక (54.20 శాతం), ఆంధ్రప్రదేశ్ (50.90 శాతం) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచినట్టు చెప్పారు. కాగా, చోరీకి గురైన ఫోన్ల రికవరీలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిన మహేశ్ భగవత్ను డీజీపీ అంజనీకుమార్ ప్రత్యేకంగా అభినందించారు.