మైనార్టీల సంక్షేమం, అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేండ్ల పాలనలో మైనార్టీల జీవితాల్లో వెలుగులొచ్చాయని చెప్పారు. మంగళవారం శాసనమండలిలో మైనార్టీ సంక్షేమశాఖ కార్యక్రమాలపై నిర్వహించిన స్వల్పకాలిక చర్చలో సభ్యులు టీ జీవన్రెడ్డి, జాఫ్రీ, మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఇఫెండి తదితరులు ప్రస్తావించిన అంశాలపై మంత్రి సమాధానమిచ్చారు. మైనార్టీ సంక్షేమానికి ఏడేండ్లలో రూ.6,644.26 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. 204 మైనార్టీల గురుకులాల్లోని ఒక్కొక్క విద్యార్థికి రూ.60 వేల చొప్పున ఖర్చు పెడుతున్నట్టు వివరించారు. విదేశీ చదవుల నిమిత్తం 223 మందికి స్కాలర్షిప్లు అందజేశామని వెల్లడించారు. షాదీముబారక్ పథకం వల్ల హైదరాబాద్లోనే దాదాపు 72,764 మంది లబ్ధిపొందారని చెప్పారు. క్రిస్టియన్ భవనం కోసం 2 ఎకరాల స్థలం, రూ.10 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా క్రైస్తవ శ్మశాన వాటికల కోసం 42 ఎకరాల 21 గుంటల భూమిని కేటాయించినట్టు తెలిపారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, అభివృద్ధికి ‘తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్’ను ఏర్పాటుచేసినట్టు వివరించారు.
విద్యుత్తు వినియోగం వృద్ధిలో మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానం, తలసరి వినియోగంలో ఐదో స్థానం సాధించిందని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామం, తండా, గూడెంలో విద్యుద్దీకరణ జరిగిందని చెప్పారు. మంగళవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు మర్రి జనార్దన్రెడ్డి, క్రాంతికిరణ్, కోరుకంటి చందర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 9,680 మెగావాట్లు పెరిగిందని, మరో 7,962 మెగావాట్ల ప్రాజెక్టులు నిర్మాణ దశల్లో ఉన్నాయని వివరించారు. ఇప్పటివరకు రూ.16,210 కోట్లు వెచ్చించి విద్యుత్తు సరఫరా వ్యవస్థను మెరుగుపర్చామని తెలిపారు. 2014కు పూర్వం 1.11 కోట్లుగా ఉన్న విద్యుత్తు కనెక్షన్లు ఇప్పుడు 1.65 కోట్లకు, 19 లక్షలున్న వ్యవసాయ కనెక్షన్లు 25.63 లక్షలకు పెరిగాయని వివరించారు. మరో లక్ష మంది వ్యవసాయ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.
ఉపాధిహామీ పథకం నిధులను అత్యధికంగా సద్వినియోగం చేసుకొన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు, డంపింగ్యార్డులు, నర్సరీలు, పల్లెప్రకృతి వనాలను నిర్మించామని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టలేదని చెప్పారు. శాసనసభ్యులు బాల్క సుమన్, పట్నం నరేందర్రెడ్డి, రాములునాయక్, సండ్ర వెంకటవీరయ్య అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 12,769 గ్రామాల్లో 12,622 వైకుంఠధామాలను రూ.1,547 కోట్లతో నిర్మించామని, ఒక్కొక్కదానికి రూ.12.70 లక్షలు ఖర్చు చేశామని చెప్పారు. 12,737 డంపింగ్ యార్డులను రూ.319 కోట్లతో నిర్మించామని పేర్కొన్నారు.