హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ)/అమీర్పేట్: మహిళల రక్షణ, భద్రత విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని పేర్కొన్నారు. అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా సోమవారం బేగంపేటలోని ఒక హోటల్లో సోనమ్ మిట్టల్ మహిళా సంక్షేమ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలు, బాలికలకు అవార్డులు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేనివిధంగా మహిళల కోసం షీ టీమ్స్, భరోసా, సఖి కేంద్రాలు, వీ-హబ్ ఏర్పాటు చేసిందని వివరించారు.
మహిళలకు ఏవైనా సమస్యలు ఎదురైతే మహిళా కమిషన్ దృష్టికి తీసుకొనిరావాలని సూచించారు. నేరుగా కమిషన్ కార్యాలయానికి రాలేనివాళ్లు సోషల్ మీడియా ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఈ-మెయిల్ telanganastatewomenscommission@gmail.com, హెల్ప్లైన్ 181, కమిషన్ వాట్సాప్ నంబర్ 9490555533కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ కార్యదర్శి కృష్ణకుమారి పాల్గొన్నారు.