తెలంగాణ పనితీరును కేంద్రం గుర్తించింది
విద్యుత్తు రంగంలో తెలంగాణ అద్భుతమైన పనితీరును కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. విద్యుత్తు ఉత్పత్తిలో తెలంగాణ జెన్కో, సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రాలు దేశంలోనే వరుసగా తొలి రెండుస్థానాల్లో నిలవడంపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘భారత ప్రభుత్వంలోని మరో మంత్రిత్వశాఖ విద్యుత్తురంగంలో తెలంగాణ అద్భుత పనితీరును గుర్తించింది. తెలంగాణ జెన్కో, సింగరేణి కాలరీస్లు విద్యుత్తు ఉత్పత్తిలో మొత్తం దేశంలోనే 1, 2వ స్థానంలో ఉన్నాయి. అదికూడా అత్యధిక పీఎల్ఎఫ్తో..’ అని ట్వీట్చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): విద్యుదుత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. 72.35 శాతం ఉత్పత్తి సామర్థ్యంతో టీఎస్ జెన్కో, 69.87%తో సింగరేణి విద్యుదుత్పత్తి కేంద్రం దేశంలోనే తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. 2020-21 సంవత్సరానికిగాను పీఎల్ఎఫ్ నివేదికను కేంద్ర విద్యుత్తుశాఖ ఇటీవలే విడుదల చేసింది. విద్యుదుత్పత్తిలో తెలంగాణ పనితీరును కేంద్రం గుర్తించిందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఒక విద్యుత్తు ఉత్పాదక కేంద్రం స్థాపిత సామర్థ్యంలో ఎంతశాతం కరెంటును ఉత్పత్తిచేసిందో దానినే పీఎల్ఎఫ్గా పిలుస్తారు. ఈ పీఎల్ఎఫ్ ఆధారంగా కేంద్ర విద్యుత్తుశాఖ ర్యాంకులను ఖరారుచేస్తుంది. అన్ని ప్రభుత్వరంగ జెన్కోల్లో తెలంగాణ మొదటి స్థానం సొంతం చేసుకోగా, సింగరేణి రెండు, ఛత్తీస్గడ్ మూడో స్థానాల్లో నిలిచాయి. ఏపీ జెన్కో 9వ స్థానంలో ఉన్నది. జాతీయస్థాయి సగటు పీఎల్ఎఫ్ 54.49% కాగా.. టీఎస్ జెన్కో 17.86% అదనంగా ఉత్పత్తిచేసి అగ్రస్థానంలో నిలిచింది. ఏపీ జెన్కో కేంద్రాలు 51.57 శాతంతో జాతీయ సగటుకన్నా 2.92% తక్కువగా ఉత్పత్తిచేశాయి. టీఎస్ జెన్కోకు చెందిన పాల్వంచ 7వ దశ విద్యుత్తు కేంద్రం అత్యధికంగా 87.18, ఆరోదశ ప్లాంటు 81.20 శాతం కరెంటును ఉత్పత్తిచేశాయి. రోజువారీగా లెక్కిస్తే ఏప్రిల్ 7న రికార్డుస్థాయిలో 8.41 కోట్ల యూనిట్ల ఉత్పత్తి జరిగింది. మార్చి నెలలో 235.40 కోట్ల యూనిట్ల తయారీతో సరికొత్త రికార్డు నమోదయింది. కేంద్రప్రభుత్వ థర్మల్ కేంద్రాల్లో 80.30 శాతంతో ఎన్టీపీసీ సంస్థలు ముందున్నాయి. ప్రైవేట్ రంగంలో మహారాష్ట్రలోని దహను వద్దనున్న రిలయన్స్ సంస్థకు చెందిన విద్యుత్తు ఉత్పాదక కేంద్రం 73.30 శాతంతో అగ్రస్థానంలో ఉన్నట్లు కేంద్రం పీఎల్ఎఫ్ నివేదికలో వెల్లడించింది.
మన సామర్థ్యానికి నిదర్శనం
పీఎల్ఎఫ్లో తెలంగాణ ప్లాంట్లు దేశంలో మొదటి రెండుస్థానాల్లో నిలువడం విద్యుత్తు రంగంలో మన సామర్థ్యానికి నిదర్శనం. ప్రభుత్వం, సింగరేణి సంస్థ, అధికారులు, విద్యుత్తు ఉద్యోగులు అందరి కృషివల్లే ఇది సాధ్యమైంది. సీఎం కేసీఆర్ ఏడేండ్లుగా విద్యుత్తును అత్యంత ప్రాధాన్య అంశంగా చూస్తున్నారు. నిరంతరం పర్యవేక్షిస్తూ, సలహాలు సూచనలు ఇస్తున్నారు. ప్లాంట్లలో విద్యుత్తును గరిష్ఠంగా ఉత్పత్తి చేయడం వల్ల ఉత్పత్తి నష్టాలు (జనరేషన్ లాస్) తగ్గుతాయి. వ్యయం కూడా భారీగా తగ్గుతుంది. ఉద్యోగులు ఇదేస్ఫూర్తితో ముందుకెళ్లాలని అసోసియేషన్ తరఫున కోరుతున్నా. – పీ శివాజీ, తెలంగాణ ఎలక్ట్రిక్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు