మహబూబ్నగర్ అర్బన్, ఆగస్టు 9 : బతుకుదెరువు కోసం వలసలు వెళ్లిన జిల్లా.. నేడు వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించే స్థాయికి చేరుకున్నదని, తెలంగాణ ఏర్పడిన తరువాత మహబూబ్నగర్ రూపురేఖలు మారిపోయాయని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మినీ శిల్పారామంలో బుధవారం టాస్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్మేళాను మంత్రి శ్రీనివాస్గౌడ్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దివిటిపల్లి శివారులో నిర్మించిన ఐటీ కారిడార్లో స్థానికంగా ఉన్న 650 మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మెగా జాబ్మేళాను నిర్వహించినట్లు తెలిపారు.
వచ్చే నెల 2వ తేదీన 10 వేల జాబ్లకు మేళా నిర్వహిస్తామన్నారు. ఈ నెల 13వ తేదీన 450 డ్రోన్లతో జిల్లాస్థాయిలోనే అతిపెద్ద ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కార్యక్రమంలో కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నరసింహ, టాస్క్ డైరెక్టర్ ప్రదీప్రెడ్డి, సెట్విన్ ఎండీ వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడాచైర్మన్ వెంకన్న, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.