సంగారెడ్డి : వివిధ విభాగాల్లో త్వరలోనే 20 వేల పోలీసు నియామకాలను చేపట్టనున్నట్లు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. రూ. కోటి వ్యయంతో నిర్మించిన సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని హోంమంత్రి శనివారం ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి వివిధ విభాగాలలో ఇప్పటివరకు 80 వేల మందికి పైగా రిక్రూట్ చేసినట్లు చెప్పారు. మహిళా ప్రాధాన్యతలో భాగంగా నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించినట్లు తెలిపారు. మహిళలకు రక్షణ నిమిత్తం షీ టీమ్స్ ఏర్పాటును ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
పోలీసుశాఖకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మహమూద్ అలీ తెలిపారు. తగినన్నీ నిధులు కేటాయించడం ద్వారా పోలీసుశాఖ నూతన వాహనాలు సమకూర్చుకోవడం గానీ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటూ సమర్థ పోలీసింగ్ను నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రంలో నేరాలకు పాల్పడేందుకు నేరస్థులు భయపడుతున్నారన్నారు. ఇక్కడి పోలీసులు గంటల్లోనే కేసులను ఛేదించగలుగుతున్నట్లు చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలోనూ పోలీసు శాఖ కీలక పాత్ర పోషించిందన్నారు. గత సంవత్సర కాలంగా లాక్డౌన్ సమయాల్లో పోలీసుల త్యాగాలను హోంమంత్రి ప్రశంసించారు.
శాంతిభద్రతలకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్న హోంమంత్రి దేశంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో 70 శాతం తెలంగాణలోనే ఉన్నాయన్నారు. కేసులను ఛేదించడంలో సీసీ కెమెరాలు పోలీసుల పనిని సులభతరం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో శిక్షణ పొందిన మహిళా కానిస్టేబుల్ను రిసెప్షనిస్ట్గా నియమించడం ద్వారా సామాన్య ప్రజలు ఎటువంటి భయం లేకుండా పోలీస్ స్టేషన్కి వస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ ప్రొటెం చైర్మన్ వి. భూపాల్రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఐజీ (వెస్ట్ జోన్) స్టీఫెన్ రవీంద్ర, డీఐజీ నిజామాబాద్ రేంజ్ శివశంకర్ రెడ్డి, పోలీసు సూపరింటెండెంట్ ఎస్ చంద్రశేకర్ రెడ్డి, అదనపు ఎస్పీ కె. శ్రుజన, అదనపు కలెక్టర్ జె. వీరా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.