ఆదిలాబాద్ జిల్లా గాయత్రి జలపాతం వద్ద నిర్వహణ
సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 4 వరకు పోటీలు
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): మూడో ప్రపంచ వాటర్ఫాల్ రాప్లింప్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్నది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండివాగు గ్రామ సమీపంలోని 330 అడుగుల ఎత్తున్న గాయత్రి జలపాతంలో ఈ పోటీలను నిర్వహించనున్నారు. గతంలో రెండు ప్రపంచ వాటర్ ఫాల్ రాప్లింప్ పోటీలను అరకులోయలోని 420 అడుగుల కటిక జలపాతం వద్ద 2019, 2020లో నిర్వహించారు.
కరోనా కారణంగా ఒక్క ఏడాది విరామం అనంతరం గాయత్రి జలపాతం వద్ద ఈ ప్రతిష్ఠాత్మక పోటీలను నిర్వహిస్తున్నారు. ఉవ్వెత్తున దూకే జలపాత ధారల్లో తాడు సాయంతో పై నుంచి (స్ట్రెయిట్ పాయింట్) కిందకు (ఫినిష్ పాయింట్)కు చేరడాన్నే వాటర్ఫాల్ రాప్లింప్ అంటారు. ప్రపంచంలోని చాలా దేశాలు అడ్వెంచర్ టూరిజంలో భాగంగా సాహసాలు చేసేవారి కోసం దీనిని నిర్వహిస్తున్నాయి. తెలంగాణలో నిర్వహిస్తున్న పోటీల్లో దాదాపు 30కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొనొచ్చని వాటర్ ఫాల్ రాప్లింప్ వరల్డ్ కప్ ఆర్గనైజింగ్ కమిటీ (డబ్ల్యూఆర్డబ్ల్యూసీవోసీ) వ్యవస్థాపకుడు రంగారావు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 33 టీవీ చానెల్స్ ఈ పోటీలను టెలికాస్ట్ చేస్తాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టూరిజం శాఖ ప్రోత్సాహం, ఐటీడీఏ వారి పూర్తి సహకారంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో తెలంగాణ అడ్వెంచర్ టూరిజంలో దేశంలోనే మొదటిస్థానంలో నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.