హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అంతరిక్ష సాంకేతికతకు అవసరమైన ఎకోసిస్టంను అభివృద్ధి చేసేందుకు త్వరలోనే మార్గదర్శకాలు జారీచేస్తామని ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం డైరెక్టర్ రమాదేవి లంక తెలిపారు. హైదరాబాద్లో రెండురోజులపాటు జరిగిన 24వ ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సులో అంతరిక్ష సాంకేతిక అభివృద్ధి కోసం హైదరాబాద్లో ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ను ఏర్పాటుచేయాలన్న మంత్రి కేటీఆర్ విజ్ఞప్తిపై కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రంగం అభివృద్ధికి మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు రమాదేవి శనివారం తెలిపారు. ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సులో శనివారం ఆమె ‘క్రియేటింగ్ ఏ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఎకోసిస్టం’ అనే అంశంపై మాట్లాడుతూ స్పేస్టెక్ ప్రపంచ వాణిజ్యీకరణ, ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. హైదరాబాద్లో ఇప్పటికే స్పేస్ టెక్నాలజీ రంగం ప్రముఖంగా అభివృద్ధి చెందుతున్నదని, అనేక పరిశ్రమలు, స్టార్టప్స్ ఈ రంగంలో కొనసాగు తున్నాయని పేర్కొన్నారు.
పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ మాట్లాడుతూ ప్రభుత్వ-పౌరసేవల్లో సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో తెలంగాణ రాష్ట్రం ముందున్నదని చెప్పారు. ఈ- గవర్నెన్స్ కమిషనర్ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ పౌర సేవలను మరింత పారదర్శకంగా, సులభతరంగా నిర్వహించేందుకు రియల్ టైమ్ డిజిటల్ ఐడెంటిటీ వెరిఫికేషన్ అమలుచేస్తున్నట్టు తెలిపారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర నిమ్జే మాట్లాడుతూ సుపరిపాలనలో తెలంగాణ రాష్ట్రం 250 అప్లికేషన్స్ ప్రవేశపెట్టడం ద్వారా వేగంగా పురోగతి సాధిస్తున్నదని వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్ విభాగం డైరెక్టర్ సుజయ్ కారంపురి మాట్లాడుతూ టీ-ఫైబర్ ప్రాజక్టు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 25-30 ఏండ్లవరకు ఉపయోగపడేలా హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు దేశంలో స్పేస్టెక్ పాలసీ ఉన్న ఏకైక రాష్ట్రం కేరళ కాగా, మార్గదర్శకాలు విడుదలైతే ఆ దిశగా పయనిస్తున్న రెండో రాష్ట్రం తెలంగాణ అవుతుంది.