సరఫరాకు మూడు దేశాలకు చెందిన 11 కంపెనీలు రెడీ
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. రానున్న రోజుల్లో వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగును మరింత విస్తరించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. 2024 వ్యవసాయ సీజన్ నుంచి ఏకంగా 10 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగుకు కసరత్తు చేస్తున్నది. ఇందుకు అవసరమైన విత్తనాలను విదేశాల నుంచి కొనుగోలు చేయాల్సి ఉండటంతో మలేషియా, కోస్టారికా, ఇండోనేషియా, థాయిలాండ్ తదితర దేశాల నుంచి ఏకంగా 5 కోట్ల మొలకెత్తిన విత్తనాల కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
దీనిలో భాగంగా ఆయిల్ ఫెడ్ ఎండీ సురేందర్, రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రామ్రెడ్డి, ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం డైరెక్టర్ అఖిల్ కుమార్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి తదితరులు ఇటీవల మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్లో పర్యటించి అక్కడి నర్సరీలను పరిశీలించారు. మొలకెత్తిన విత్తనాల సరఫరాకు 11 కంపెనీలు అంగీకరించాయని, వచ్చే ఏడాది రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలకు సరిపడా విత్తనాలు వస్తాయని ఆయిల్ ఫెడ్ ఎండీ సురేందర్ వెల్లడించారు. దీనికి రూ.375 కోట్లు ఖర్చవుతాయని, తుది ధరలు ఖరారయ్యాక ఆయా కంపెనీలతో ఒప్పందం చేసుకొంటామని తెలిపారు.