హైదరాబాద్, జూలై 1(నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని ఎకో టూరిజం హబ్గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ(టీఎస్టీడీసీ) ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. హోటళ్లు, రిసార్ట్లు, జనవనరులు ఉన్న దగ్గర బోట్లు/క్రూజ్లు, వే సైడ్ సౌకర్యాలు, రెస్టారెంట్లు, సస్పెన్షన్ వంతెనల అభివృద్ధికి కృషి చేస్తున్నది. కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ (మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంప్హౌస్, కాళేశ్వరం దేవాలయం, అన్నారం బరాజ్, వాటర్ కెనాల్, సుందిళ్ల బరాజ్, ఎల్లంపల్లి రిజర్వాయర్) అభివృద్ధికి ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.750 కోట్లు కేటాయించింది. వీటి పనులు డిజైన్ దశలో ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయడంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ను పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దింది. నాగార్జున సాగర్ సమీపంలో బుద్ధవనం ప్రాజెక్ట్ను అభివృద్ధి చేసింది. ఇవే కాకుండా స్వదేశ్ దర్శన్, ప్రసాద్ స్కీం కింద రూ.473 కోట్ల విలువైన ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. మహబూబ్నగర్ జిల్లాలో రూ.101.72 కోట్లతో తీర్థయాత్ర, ప్రకృతి టూరిజం సర్క్యూట్ అభివృద్ధి, మంచిర్యాలలో ఎకో టూరిజం సర్క్యూట్కు రూ.98 కోట్లు, రాష్ట్రంలో ఫోర్ట్ సర్క్యూట్కు రూ.101కోట్లు, మహబూబ్నగర్ జిల్లా మన్యంకొండ ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు, భద్రాచలంలోని తీర్థయాత్ర సౌకర్యాల అభివృద్ధికి రూ.61.84 కోట్లు, ములుగు జిల్లా రామప్ప ఆలయానికి రూ.62.73 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. వీటికి అనుమతి లభిస్తే పర్యాటక చరిత్రలో తెలంగాణ కొత్త మైలురాళ్లను చేరుకుంటుంది.