హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): మెగా డెయిరీ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆదేశించారు. బుధవారం మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో డెయిరీ నూతన చైర్మన్ సోమా భరత్కుమార్తో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సంస్థకు నూతన చైర్మన్గా నియమితులైన సోమా భరత్కుమార్ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖ, పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న కార్యక్రమాలను సమీక్షించారు. విజయ డెయిరీ అభివృద్ధిలో భాగంగా సుమారు రూ.250 కోట్ల వ్యయంతో అత్యాధునిక పరిజ్ఞానంతో 5 లక్షల లీటర్ల సామర్థ్యంతో రంగారెడ్డి జిల్లా రావిర్యాల వద్ద మెగా డెయిరీ నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. తెలంగాణ విజయ డెయిరీ ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉన్నదని, అవి ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా పెద్ద ఎత్తున ఔట్లెట్లను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.
రాష్ట్ర ఏర్పాటుకు ముందు నష్టాలలో ఉన్న విజయడెయిరీని తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో చేపట్టిన చర్యలతో 700 కోట్ల రూపాయల టర్నోవర్కు చేరుకున్నదని వివరించారు. దీనిని వెయ్యి కోట్లకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో విజయ డెయిరీని మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. అందులో భాగంగా మరిన్ని నూతన విజయ ఔట్లెట్లను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. విజయ ఉత్పత్తుల విక్రయాల పెరుగుదలకు అనుగుణంగా ఉత్పత్తి చేసేందుకు మెగా డెయిరీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు ప్రభుత్వపరంగా అనేక విధాలుగా చేయూతను అందిస్తున్నదని, ఈ విషయాన్ని రైతులకు వివరించి విజయ డెయిరీకి పాలు పోసేలా ప్రోత్సహించాలని సూచించారు.
పాల సేకరణ పెరిగే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంతేకాకుండా రాష్ట్ర అవసరాలకు సరిపడా పాల ఉత్పత్తి మన రాష్ట్రంలోనే జరిగేందుకు అధిక పాలను ఇచ్చే నాణ్యమైన పాడి పశువుల ఉత్పత్తి కోసం పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖల సహకారంతో గ్రామాలలో కృత్రిమ గర్భధారణ శిబిరాల నిర్వహణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గోపాలమిత్రల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్సెక్రెటరీ, విజయ డెయిరీ ఇంచార్జి ఎండీ అధర్ సిన్హా, మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, టీఎస్ఎల్డీఏ సీఈవో మంజువాణి పాల్గొన్నారు.