హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. ఈ మేరకు సంప్రదాయ కళలు, హస్తకళలను ప్రపంచానికి చాటిచెప్పేలా ‘జీఐ ఆన్ వీల్స్’ రూపొందించినట్టు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆరు జిల్లాల్లోని జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) పొందిన 6 కళారూపాలను తొలి విడతగా ఎక్స్ప్రెస్ బస్సులపై ప్రదర్శించనున్నట్టు వివరించారు.
ప్రయాణికులు, ప్రజల్లో తెలంగాణ ప్రాచీన కళలు, చేతి వృత్తులపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. బస్సులపై ఉండే ఈ కళాకృతులు రాష్ట్ర పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతోపాటు, స్థానిక కళాకారులకు మంచి గుర్తింపును తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుక్రవారం ఎంజీబీఎస్లో ప్రారంభిస్తారని నాగిరెడ్డి వెల్లడించారు.