అమరావతి : తిరుమలలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. సజీవ దహనమైన వ్యక్తి మల్లిరెడ్డిది ఆత్మహత్యగా నిర్ధారించారు. షాపు నెం.84 వద్ద పెట్రోల్ పోసుకుని మల్లిరెడ్డి బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించారు.
ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించుకోవడంతో సమీపంలోని ఇతర దుకాణాలకు మంటలు అంటుకొని దగ్ధమైనట్లు తేల్చారు. మల్లిరెడ్డి తన మొబైల్, పర్స్ మరో షాపులో ఉంచినట్లు గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మృతుడి భార్య శోభ సహాయంతో మొబైల్ లాక్ తీసి పరిశీలించారు. మంగళవారం వేకువజామున 5 గంటల సమయంలో మల్లిరెడ్డి ఓ సెల్ఫీ వీడియో రికార్డు చేసినట్టు గుర్తించారు.
ఆ వీడియోలో ఏం చెప్పారన్నది సర్వత్రా ఆసక్తి రేపుతున్నది. ఇప్పటికే పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మల్లిరెడ్డి పోస్టుమార్టం నివేదిక రాగానే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.