ఖైరతాబాద్, డిసెంబర్ 13 : ఎంపీటీసీల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడిల కుమార్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల బలోపేతానికి ఆర్టికల్ 73, 74 రాజ్యాంగ చట్ట సవరణ ద్వారా 243 జీవో, 11వ షెడ్యూల్లో పేర్కొన్న 29 అంశాలను అమలు చేయాలని కోరారు.
ప్రతి ఎంపీటీసీకి సంవత్సరానికి రూ.20 లక్షల చొప్పున 1,300 కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీలో గౌరవప్రదమైన సీటు, గదిని కేటాయించాలని, ప్రాథమికోన్నత బడుల్లో ఎంపీటీసీలకు జాతీయజెండాను ఆవిష్కరించే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ద్వారా ఎన్నికైన ఎమ్మెల్సీల నిధులు మండల పరిషత్తుల ద్వారా కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీ రవీందర్, ఉపాధ్యక్షులు మాణిక్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం కోశాధికారి మన్నె రాజు, రాష్ట్ర కార్యదర్శి జీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.