హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రం నాణ్యమైన చదువులకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. ఉన్నత విద్య అభ్యసనకు రాష్ర్టాన్ని ఎంపిక చేసుకొంటున్నారు. మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నారు. ఇంటర్ పూర్తి చేసి ఇంజినీరింగ్లో చేరాలనుకొంటున్నవారిలో అత్యధికులు తెలంగాణలో చదివేందుకు ఇష్టపడుతున్నారు. ఇందుకు ఏపీ నుంచి టీఎస్ ఎంసెట్కు దరఖాస్తుల సంఖ్య ఏటా పెరగటమే నిదర్శనంగా చెప్పవచ్చు. 2021లో వీరి దరఖాస్తుల సంఖ్య 51,848 కాగా, 2022కు వచ్చేసరికి 53,931 ఉండగా, 2023లో ఇప్పటివరకు 56,374 దరఖాస్తులు నమోదయ్యాయి. ఆలస్య రుసుముతో మే 2 వరకు గడువు ఉండగా, ఇంకా దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. ఇదిలావుండగా, ఈ ఏడాది ఎంసెట్కు 2.67లక్షల దరఖాస్తులు ఇప్పటివరకు వచ్చాయి. తుది గడువు నాటికి మూడు లక్షల దరఖాస్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏపీ విద్యార్థులు తెలంగాణలోనే ఇంజినీరింగ్ పూర్తిచేసేందుకు ఇక్కడి ఐటీ భూమ్ కారణమన్న వాదనలున్నాయి. కొవిడ్తో అన్ని రంగాలు కుదేలయినా ఐటీ రంగం వేగంగా పుంజుకొంటున్నది. ముఖ్యంగా తెలంగాణ ఐటీ రంగం రోజురోజుకు పురోభివృద్ధి సాధిస్తున్నది. ఈ నేపథ్యంలో విద్యార్థుల వైఖరిలోనూ మార్పు కనిపిస్తున్నది. దీనికితోడు తెలంగాణలో అత్యధిక ఇంజినీరింగ్ కాలేజీలు హైదరాబాద్ చుట్టుపక్కలే ఉండటం, భవిష్యత్తులో ప్లేస్మెంట్స్, క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా కంపెనీలు ఇక్కడి విద్యార్థులనే ఎంపిక చేసుకొనే అవకాశం ఉన్నది. తద్వారా తెలంగాణ ఎంసెట్కు హాజరై, ఇక్కడే సీట్లు పొంది, తద్వారా ఐటీ ఉద్యోగాలు సొంతం చేసుకొనే ఆలోచనతో ఇటు వైపు వస్తున్నట్టుగా నిపుణులు భావిస్తున్నారు.
ఏపీ నుంచి ఇంజినీరింగ్ విభాగానికి నిరుడు కేవలం 36,012 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది ఈ ఒక్క విభాగానికే 40,182 దరఖాస్తులు నమోదయ్యాయి. అంటే ఇప్పటికే 4వేలకు పైగా దరఖాస్తులు ఎక్కువ వచ్చాయి. ఇక అగ్రికల్చర్ అండ్ మెడికల్కు ఇప్పటివరకు 16,192 దరఖాస్తులు సమర్పించారు.