యాదాద్రి భువనగిరి: మంత్రి కేటీఆర్ను బర్తరఫ్ చేయాలని బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో బండి సంజయ్ రాజకీయ దుమారం రేపి నిరుద్యోగుల జీవితాలతో ఆటాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు బాధ్యత మరిచి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరైనది కాదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని చేసిందేమిటో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
బండి సంజయ్ వైఖరి బాధ్యతారహితంగా ఉందని గొంగిడి సునీత విమర్శించారు. నోరు తెరిస్తే బీజేపీ వాళ్ళు అబద్ధాలు మాట్లాడుతున్నారని, మత విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్రాన్ని అలకల్లోలం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్కి రాజ్యాంగం పట్ల అవగాహన లేదన్నారు. కరీంనగర్ ప్రజలు బండి సంజయ్ని ఎందుకు గెలిపించామా.. అని బాధపడుతున్నారని చెప్పారు. టీఎస్పీఎస్సీ స్వయం ప్రతిపత్తిగల సంస్థని, దానిలో ప్రభుత్వ ప్రమేయం ఉండదనే విషయాన్ని బండి సంజయ్ గుర్తుంచుకోవాలని ఆమె పేర్కొన్నారు.
పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సునీత చెప్పారు. ఐటీ మంత్రిని భర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేయడం సిగ్గుచేటన్నారు. రాజేందర్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదని, గుజరాత్లో కేబుల్ బ్రిడ్జి తెగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతే బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తోందని ఆరోపించారు. ఈ సమావేశంలో బీఅర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.