జూన్ 2న తెలంగాణ అవతరణ పండుగ
జిల్లాలవారీగా మంత్రులకు బాధ్యతలు
హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తున్నది. జూన్ 2న రాష్ట్రంలోని పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్ర అవతరణ ఉత్సవాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శుక్రవారం బీఆర్కేభవన్లో సమీక్ష నిర్వహించారు. వేడులకు సకాలంలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్ 2న ఉదయం సీఎం కేసీఆర్ తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి, ఆ తర్వాత పబ్లిక్ గార్డెన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించాక సీఎం ప్రసంగిస్తారని చెప్పారు. సాయంత్రం 30 మంది ప్రముఖ కవులతో రవీంద్రభారతిలో కవిసమ్మేళనం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాలు ఆవిష్కరించే మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారుల జాబితాను విడుదలచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కే తారకరామారావు, కామారెడ్డిలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి జాతీయ పతాకాలను ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు.