Telangana CEO Vikas Raj |తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ చెప్పారు.13 నియోజకవర్గాల పరిధిలో నాలుగు గంటలకే ఎన్నికల ప్రచారం ముగిసింది. సైలెంట్ పీరియడ్ ప్రారంభమైందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైందని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వారిలో 1,62,98,418 మంది పురుషులు, 1,63,01,750 మంది మహిళా ఓటర్లు ఉన్నారని తెలిపారు. థర్డ్ జెండర్ ఓటర్లు 2,676 మంది, సర్వీ్స్ ఓటర్లు 15,406, ఓవర్సీస్ ఓటర్లు 2,944 మంది ఉన్నారని వికాస్ రాజ్ తెలిపారు.
119 నియోజకవర్గాల్లో 2290 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నాయని అన్నారు. ఎన్నికల విధుల్లో లక్ష మంది పాల్గొంటున్నారని అన్నారు. తెలంగాణ పోలీసులు 65వేల మంది, 18 వేల మంది హోంగార్డులు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. మొత్తం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో లక్ష మంది భద్రతా సిబ్బంది పాల్గొంటున్నారని అన్నారు. 375 కంపెనీల కేంద్ర బలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారన్నారు. స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలి వెళ్లాలని స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 19,375 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వికాజ్ రాజ్ చెప్పారు. బుధవారం సాయంత్రం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లోకి వస్తుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ప్రచారం నిలిపేయాలని స్పష్టం చేశారు. అలాగే సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం నిలిపేయాలని చెప్పారు. రేపు ఎన్నికల సిబ్బంది సామగ్రి పంపిణి చేస్తాం అని వికాస్ రాజ్ చెప్పారు. పోలింగ్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకుంటున్నారని అన్నారు. ఇక వివిధ పార్టీల పోలింగ్ ఏజంట్లు ఉదయం 5.30 గంటలకు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 250కి పైగా, అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో 166 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు ఏర్పడకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో అదనపు భద్రతా సిబ్బందిని నియమించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఐదంచెల భద్రత ఉంటుందన్నారు. 10 వేలకు పైగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు.
ఎన్నికల నేపథ్యంలో బుధ, గురు వారాల్లో హైదరాబాద్ జిల్లా పరిధిలోని విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. పోలింగ్ ముగిసిన తర్వాత అర్థ గంట వరకూ ఎగ్జిట్ పోల్స్ ప్రచురణపైనా నిషేధం విధించారు. ఈ నెల 30న పోలింగ్, వచ్చే నెల మూడో తేదీన కౌంటింగ్ జరుగనున్నది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుంది. 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఉంటుందని వికాస్ రాజ్ చెప్పారు.
పోలింగ్ ముగిసిన తర్వాత అర్థ గంట వరకూ ఎగ్జిట్ పోల్స్ ప్రచురణపైనా నిషేధం విధించారు. ఈ నెల 30న పోలింగ్, వచ్చే నెల మూడో తేదీన కౌంటింగ్ జరుగనున్నది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుంది. 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఉంటుందని వికాస్ రాజ్ చెప్పారు. 4000 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల పరిధిలో అదనపు సిబ్బందిని నియమిస్తామన్నారు. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ లను భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకుంటారని వెల్లడించారు.
ఏ రాజకీయ పార్టీ ఎటువంటి ప్రచారం చేయకూడదని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. నగదు, మద్యం సరఫరా నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ రూ.709 కోట్ల నగదు జప్తు చేశామని చెప్పారు. సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు భద్రతా బలగాలను నియమిస్తామన్నారు. సినిమాలు, సోషల్ మీడియాలో ప్రచారంపై నిషేధం అమల్లో ఉంటుందన్నారు.