హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): మొన్న స్కైరూట్.. నిన్న ధ్రువ.. ఇప్పుడు ఖేతి. హైదరాబాద్లో పుట్టి ఆకాశమంత ఎదుగుతూ సంచలనాలకు వేదికలవుతున్న సంస్థలు ఇవి. వీటన్నింటికీ జన్మస్థానం రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన టీ-హబ్. టీ-హబ్లో పురుడు పోసుకొన్న స్టార్టప్ సంస్థలు రోజుకొకటి ప్రపంచం దృష్టిని ఆకర్షించే ఘనతలు సొంతం చేసుకొంటున్నాయి. ఇంతింతై అన్నట్టు ప్రపంచ యవనికపై తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నాయి. తాజాగా టీ-హబ్లో ప్రారంభమైన అగ్రిటెక్ స్టార్టప్ ‘ఖేతి’ అంతర్జాతీయంగా అత్యంత ప్రతిష్ఠాత్మక ఎర్త్షాట్ అవార్డుకు ఎంపికైంది. బ్రిటన్ యువరాజు విలియం స్థాపించిన ఎర్త్షాట్ అవార్డుల్లో భాగంగా ప్రకృతి పరిరక్షణ-పునరుద్ధరణ (ప్రొటెక్ట్ అండ్ రిస్టోర్ నేచర్) విభాగంలో ఖేతికి ఈ అవార్డు దక్కింది. సినిమా రంగంలో ఆస్కార్ అవార్డు మాదిరిగానే ఎర్త్షాట్ అవార్డును ‘ఎకో ఆస్కార్’గా పిలుస్తారు. అంతటి ప్రతిష్ఠాత్మక అవార్డును హైదరాబాద్ స్టార్టప్ తన కీర్తి కిరీటంలో అలంకరించుకొన్నది.
ఔత్సాహికుల ఆలోచన.. టీ-హబ్ ఆచరణ
2015లో కౌశిక్ కప్పగంతుల, సత్య మొక్కపాటి, ఆయుష్ శర్మ, సౌమ్య కలిసి ‘ఖేతి’ అనే గ్రీన్టెక్ స్టార్టప్ను స్థాపించారు. సన్న, చిన్నకారు రైతులకు మేలు చేసే గ్రీన్హౌస్ ఇన్ ఏ బాక్స్ను వీరు అభివృద్ధి చేశారు. సాధారణంగా అధిక పెట్టబడి పెట్టగలిగే రైతులు భారీ విస్తీర్ణంలో గ్రీన్హౌస్ విధానంలో సాగు చేస్తుంటారు. చిన్న రైతులు మాత్రం ఎలాంటి భద్రతలేని సాగు విధానాన్ని కొనసాగిస్తున్నారు. అందుకే వాతావరణ మార్పులతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందాలనే ప్రధాన లక్ష్యంతో ఖేతి స్టార్టప్ రూపుదిద్దుకొన్నది. ఏడాది పాటు టీ-హబ్ వేదికగా కార్యకలాపాలు సాగించి.. ప్రస్తుతం దేశంలో అనేక రాష్ర్టాల్లో విస్తరించింది. ఎర్త్షాట్ అవార్డుతో ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు సాధించింది.
వెయ్యి స్టార్టప్లతో పోటీపడి..
గ్రీన్హౌజ్ విధానంలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించేలా ఆధునిక వ్యవసాయ సాగు పద్ధతులను ఖేతి ప్రోత్సహిస్తున్నది. పర్యావరణ పరంగా వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సవాళ్లకు సాంకేతికతతో పరిష్కారం చూపే సంస్థలను ప్రోత్సహించేందుకు బ్రిటన్ యువరాజు విలియం ఎర్త్షాట్ అవార్డులను ప్రారంభించారు. ఈ అవార్డులను గత ఏడాది నుంచి ఇస్తున్నారు. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 10 దేశాల నుంచి దాదాపు వెయ్యి స్టార్టప్లు పోటీ పడ్డాయి. నిపుణులతో కూడిన ప్యానల్ ఐదు విభాగాల్లో ఐదు స్టార్టప్లను అవార్డులకు ఎంపిక చేసింది. ప్యానల్ సభ్యులు శుక్రవారం హైదరాబాద్కు వచ్చి ఖేతి వ్యవస్థాపకులతో చౌమహల్లా ప్యాలెస్లో సమావేశమై సంస్థ కార్యకలాపాల గురించి చర్చించారు. అనంతరం శుక్రవారం రాత్రి అమెరికాలోని బోస్టన్ వేదికగా ఈ అవార్డును ప్రకటించారు. అవార్డు కింద రూ.10 కోట్ల (ఒక మిలియన్ పౌండ్స్) బహుమతి లభిస్తుంది.
ఆదిలోనే గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం
సన్న, చిన్నకారు రైతుల ప్రయోజనమే లక్ష్యంగా ఏర్పాటైన ఖేతిని ఆదిలోనే తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. టీ-హబ్లో పురుడుపోసుకొన్న మూడు స్టార్టప్లకు 2017లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అవార్డులు ప్రకటించింది. ఇందులో బెస్ట్ సస్టెయినబుల్ అవార్డు విభాగం కింద ఖేతి అవార్డు దక్కించుకొన్నది. మంత్రి కేటీఆర్ ఈ అవార్డులు ప్రదానం చేశారు. ఖేతి ఏర్పాటు తర్వాత తొలుత 2017లో సిద్దిపేటలో 50 మంది రైతులను భాగస్వాములను చేశారు. ఈ – డిజైన్లోని విధానాల ద్వారా వ్యవసాయం చేయగా.. వ్యవస్థాపకుల అంచనాల్లో 75 శాతం మేర అధిక దిగుబడిని రైతులు సాధించారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఖేతిని గుర్తించి అవార్డు ఇచ్చి ప్రోత్సహించింది. అనంతరం ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశాలోనూ గ్రీన్హౌజ్ సాగులో రైతులకు ఈ సంస్థ తర్ఫీదు ఇస్తున్నది.
ఖేతి ప్రధాన లక్ష్యాలివి..
ఖేతి స్టార్టప్ లక్ష్యాలను సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన సత్య మొక్కపాటి ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు.
సన్న, చిన్నకారు రైతులు గ్రీన్హౌజ్ ద్వారా కూరగాయలు పండిస్తారు. చిన్న కమతాల్లోనే చుట్టూ నెట్ (వల)ను ఏర్పాటు చేస్తారు. సంప్రదాయ పద్ధతిలో వినియోగించే దానిలో దాదాపు 50 శాతం తక్కువ నీటితోనే సాగు చేస్తారు.
అనేక సంస్థలకు అంతర్జాతీయ ఖ్యాతి
టి-హబ్లో పురుడుపోసుకున్న అనేక స్టార్టప్లు ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు సాధిస్తున్నాయి. నింగిలోకి విజయవంతంగా దూసుకుపోయిన తొలి ప్రైవేటు రాకెట్ను స్కైరూట్ స్టార్టప్ తయారు చేసింది. ధృవ స్టార్టప్ శాటిలైట్ను రూపొందించింది. డార్విన్ బాక్స్ అనే హైదరాబాద్ స్టార్టప్ అంతర్జాతీయంగా రూ.500 కోట్ల వరకు ఫండింగ్ను వసూలు చేసి యూనికాన్ జాబితాలో చేరింది. గాయం, బ్లూసెమీ, మైగేట్, ఇన్ఫిఫ్రెష్.. ఇలా ఎన్నో కంపెనీలు విజయపథంలో దూసుకుపోతున్నాయి.
మారుమూల రైతు ప్రయోజనం పొందితేనే సార్థకత
బోస్టన్ వేదికపై అవార్డు ప్రకటనతో వినిపించే చప్పట్ల ద్వారా కాదు.. ఓ మారుమూల గ్రామంలోని రైతు గ్రీన్హౌస్ ద్వారా ప్రయోజనం పొందినపుడే మా స్టార్టప్కు సార్థకత చేకూరుతుంది. మనదేశంలో 10 కోట్లకు పైగా, ప్రపంచంలో 50 కోట్లకు పైగా సన్న, చిన్నకారు రైతులు ఉన్నారు. వాతావరణ మార్పులతో వీరంతా తీవ్రంగా నష్టపోతున్నారు. వారికి ఆదాయ భద్రత ఎలా ఇవ్వాలి? అనే ఆలోచన నుంచే ఈ స్టార్టప్ పుట్టింది. ఈ అవార్డు ద్వారా డబ్బులు రావడం ముఖ్యం కాదు. చిన్న రైతుల వ్యవసాయాన్ని మెరుగుపరిచి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నష్టాలు తగ్గించి, ఆదాయాన్ని పెంచాలనేది మా లక్ష్యం. ప్రభుత్వాలు, ఇతర సంస్థలు కూడా పెద్ద ఎత్తున రైతులకు అనుకూలంగా పని చేయాలి. ఇందుకోసం ఆయా సంస్థలు, ప్రభుత్వాలతో కలిసి పనిచేసేందుకు మేమెప్పుడూ సిద్ధంగా ఉంటాం. మా సాంకేతిక పరిజ్ఞానం రైతులకు ఉపయోగపడి, వారి జీవితాల్లో మార్పు రావాలి.
– సత్య మొక్కపాటి, ఖేతి స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు