హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సోనా.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధం. శరీరంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచే బియ్యం. తక్కువ ైగ్లెసిమిక్ ఇండెక్స్(జీఐ) కలిగిన ఈ అన్నాన్ని తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. డయాబెటిక్ రోగులు ఏ భయం లేకుండా తినగలిగే ఆహారం ఇది అని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో శాస్త్రీయంగా నిరూపితమైంది. తెలంగాణ సోనా(ఆర్ఎన్ఆర్ 15048)కు సంబంధించిన సమాచారం అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్లోనూ ప్రచురితమైంది. ఇటీవల వ్యవసాయ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు దీన్ని ఆవిష్కరించారు. తక్కువ జీఐ ఉన్న బియ్యాన్ని అందుబాటులోకి తీసుకురావటంపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన, డెక్కన్ ముద్ర సంస్థను అభినందించారు. సాధారణంగా షుగర్ వ్యాధిగ్రస్తులు అన్నానికి దూరంగా ఉంటారు. అన్నం తింటే శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయనే ఆందోళన. కానీ తెలంగాణ సోనాతో ఆ ఇబ్బందులేవీ ఉండవు. కారణం.. ఇందులో తక్కువ జీఐ ఉండటమే. సాధారణ రకం బియ్యంలో జీఐ 73శాతం వరకు ఉంటుంది. తెలంగాణ సోనాలో మాత్రం 51 శాతమే. గోధుమల్లో 62 శాతం, బ్రౌన్ రైస్లో 68 శాతం, జొన్నల్లో 70 శాతం జీఐ ఉంటుంది. మధుమేహ రోగులు అన్నానికి బదులుగా కొర్రలు, రాగులు, తైదలు వంటి చిరుధాన్యాలను ఆహారంగా తీసుకొంటున్నారు. వీటిలో జీఐ 50-52 శాతం వరకు ఉంటుంది. తెలంగాణ సోనాలోనూ జీఐ ఇదే స్థాయిలో ఉండటంతో ఈ అన్నం తింటే బెటర్ అని డయబెటాలజిస్టులు సూచిస్తున్నారు. మధుమేహం లేనివాళ్లు తింటే వ్యాధి రాకుండా ఉపయోగపడుతుందని చెప్తున్నారు.
తెలంగాణ సోనా రైస్ను డెక్కన్ ముద్ర సంస్థ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ సంస్థకు ఉస్మానియా యూనివర్సిటీ అల్యుమ్నీతో ఏర్పాటైన జీ-కాట్ స్వచ్చంద సంస్థ సహాయ సహకారాలను అందిస్తున్నది. ఈ సంస్థ నేరుగా రైతులను నుంచి ధాన్యాన్ని కొని విక్రయిస్తున్నది. మద్దతు ధరకు మించి ధరను చెల్లిస్తున్నది. సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్తో పాటు మరో రెండు గ్రామాల్లో రైతులతో ఒప్పందం చేసుకొని తెలంగాణ సోనా రైస్ను కొంటున్నది.
మనం తీసుకునే ఆహారం శరీరంలోకి ఎంత గ్లూకోజ్ను విడుదల చేస్తుందో లెక్కించడాన్ని ైగ్లెసిమిక్ ఇండెక్స్ అంటారు. ఎక్కువ గ్లూకోజ్ విడుదల చేసే ఆహారం తింటే మధుమేహ రోగులకు ఇబ్బంది. 1-55 శాతం ఉంటే లో-జీఐ అని, 56-69 శాతం ఉంటే మీడియం జీఐ అని, 70 శాతం ఆపై ఉంటే అధిక జీఐ అంటారు.
డెక్కన్ ముద్ర సంస్థ ప్రతినిధులు మా వద్దకు వచ్చి తెలంగాణ సోనా పండించాలని కోరా రు. వారు చెప్పినట్టు పండిస్తే, మాకు మంచి ధర ఇచ్చి రెండు పంటలను కొన్నారు. మాకు ఎంతో మేలు జరిగింది. ఇలాంటివారు రైతులకు అండగా నిలిస్తే పంటలు అమ్ముకోవటంలో మాకు ఇబ్బందులు రావు.
– కుంబాల నగేశ్రెడ్డి, రైతు, ఇబ్రహీంపూర్
జీ-కాట్ సంస్థ సహకారంతో డెక్కన్ ముద్ర ఆధ్వర్యంలో నాణ్యమైన తెలంగాణ సోనా రైస్ను మార్కెట్లోకి తీసుకొచ్చాం. మధుమేహ వ్యాధిగ్రస్తులకు తెలంగాణ సోనా గురించి తెలియదు. వారికి ఈ బియ్యంపై అవగాహన పెంచితే మార్కెటింగ్ పెరిగే అవకాశం ఉన్నది. తెలంగాణ సోనా బియ్యం అవసరమైనవారు 9989427171కు ఫోన్ చేయొచ్చు.
– ఢిల్లీ వసంత్, జీ-కాట్ ప్రతినిధి
తెలంగాణ సోనాలో జీఐ 51 శాతం మాత్రమే ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ రైస్ తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. వీటితో మిల్లెట్స్తో సమానంగా ఉపయోగం ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులే కాదు.. ఇతరులు తిన్నా మంచి ప్రయోజనం ఉంటుంది.
– డాక్టర్ నరహరి బాపనపల్లి, నీలోఫర్ దవాఖాన