వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నుతున్న శక్తుల పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని కవి, గాయకులు దేశపతి శ్రీనివాస్ కోరారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇప్పుడిప్పుడే ప్రగతిపథంలో పయనిస్తుంటే గిట్టని కేంద్రం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ అణచివేయ చూస్తుందని ఆయన విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టి 13 ఏండ్లు అయిన సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్,వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ ఆధ్వర్యంలో కాళోజి సెంటర్ వద్ద దీక్ష దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ చైతన్యానికి నెలవైన తెలంగాణలో మతోన్మాదుల ఆటలు సాగవని హెచ్చరించారు.
కేసీఆర్ ఆమరణ దీక్ష సబ్బండ వర్గాలను ఏకం చేసి ఉద్యమానికి ఊతమిచ్చిందని, కేసీఆర్ దీక్ష ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఉద్యమంలో ఓరుగల్లు కేసీఆర్ వెన్నంటి నడవడమే కాక ఎన్నో ఉద్యమ రూపాలకు ఆయువు పోసిందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్,ప్రముఖ ఆర్థిక నిపుణుడు, ప్రొఫెసర్ పాపారావు, మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, కార్పొరేటర్లు, టీఆర్ఎస్వీ నాయకులు పాల్గొన్నారు.