ఎల్లారెడ్డి, జూన్ 30 : కాంగ్రెస్ పార్టీ జెండాకు వందనం చేసిన కామారెడ్డి జిల్లా గాంధారి ఎస్సై మహేందర్ తీరు చర్చనీయాంశమైంది. గాంధారిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన పార్టీ జెండాకు సెల్యూట్ చేస్తున్న ఫొటో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఆధ్వర్యంలో సోమవారం గాంధారిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరంచారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు జెండాకు వందనం చేసిన సమయంలో అక్కడే ఉన్న ఎస్సై మహేందర్ కూడా జెండాకు వందనం చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
గాంధారిలో ఎమ్మెల్యే మదన్మోహన్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ఎస్సై మహేందర్ పార్టీ జెండాకు వందనం తీవ్ర అభ్యంతరకరమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారనేందుకు ఈ ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఘటనపై డీజీపీ వెంటనే విచారణ జరిపి, ఎస్సైపై తగిన చర్యలు తీసుకోవాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. గాంధారి ఎస్సై మహేందర్ను సస్పెండ్ చేయాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. లేకుంటే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. పోలీసు అధికారులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసు అధికారులు పార్టీ కండువాలు కప్పుకొన్నట్టుగా పని చేస్తున్నారని ఆరోపించారు.