హైదరాబాద్ : వాక్సినేషన్లో దేశంలో తెలంగాణ నంబర్ వన్గా ఉండాలని మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం ఆయన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ రెండు డోసులు ఇవ్వాలని, అందుకు స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన మున్సిపల్ సిబ్బంది, పోలీసులు, ఇతర విభాగాలకు వందశాతం బూస్టర్ డోస్ పూర్తి చేయాలని ఆదేశించారు.
డీఎం అండ్ హెచ్వోలు కలెక్టర్లతో మాట్లాడి మున్సిపల్ సిబ్బంది అందరికీ, జిల్లా ఎస్పీలతో మాట్లాడి పోలీసులందరికీ వందకు 100 శాతం బూస్టర్ డోస్ వేసేలా సమన్వయంతో పని చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రతీ పీహెచ్సీ పరిధిలో రెండో డోస్ పెండింగ్లో ఉండవద్దని, పీహెచ్సీ వైద్యులే బాధ్యత తీసుకుని రెండో డోస్ వందకు వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు వైద్యాధికారులను, క్షేత్ర స్థాయి వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 15 – 17 ఏళ్ల వారికి వేసే టీకా కార్యక్రమం వేగవంతం చేయాలన్నారు.
సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా పిల్లలు అంతా గ్రామాల్లో ఇంటి వద్దే ఉంటారని, పీహెచ్ సీ వైద్యులు ఇంటింటికి వెళ్లి 15 ఏళ్లు దాటిన పిల్లలందరి వాక్సిన్ ఇవ్వాలని చెప్పారు. క్లిష్టమైన సమయంలోనే బాధ్యతతో ప్రజలకు సేవలందించాలని, ప్రజలకు ధైర్యం ఇవ్వాలని, వాక్సినేషన్ అందరికీ ఇవ్వడం ద్వారా రక్షణ కవచాన్ని మనమే ఏర్పాటు చేయాలన్నారు. కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు అవసరమైన అన్నింటినీ ముఖ్యమంత్రి సమకుర్చుతున్నారని, 2 కోట్ల టెస్టింగ్ కిట్లు, కోటి హోం ఐసోలేషన్ కిట్లు సమకూర్చుకోవడం జరిగిందన్నారు. ప్రజలకు పూర్తిస్థాయిలో నాణ్యమైన వైద్యం అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.