పెంట్లవెల్లి, ఫిబ్రవరి 15 : మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి కాలినకడన వెళ్తున్న స్వాములను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. శివమాలధారణ స్వాములు ఇరుముడితో ఏటా కృష్ణానదీ తీరం వెంట.. మరబోట్ల సాయంతో తెలంగాణ నుంచి ఏపీలోని సంగమేశ్వర ఆలయానికి చేరుకుంటారు. అక్కడ పూజల అనంతరం కాలినడకన ముసలి మడుగు, ఆత్మకూరు మీదుగా శ్రీశైలానికి చేరుకుంటారు. రెండు నెలల కిందట తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల మరబోట్ల యజమానుల మధ్య గొడవపడటంతో ఇరు రాష్ర్టాల పోలీసులు కృష్ణానదిలో మరబోట్ల రాకపోకలపై నిషేధం విధించారు. విషయం తెలియని స్వాములు మంగళవారం సాయంత్రం పాదయాత్ర చేపట్టి పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం గ్రామ సమీపంలోని కృష్ణానది తీరానికి చేరుకున్నారు. ఆ సమయంలో నదిలో మరబోట్లు నిషేధించామని ఏపీ పోలీసులు తెలిపారు. చేసేదిలేక స్వాములు రోజంతా నది ఒడ్డునే బస చేశారు. కాగా బుధవారం ఉదయం తమను మరబోట్లలో నది దాటించి ఏపీలోకి వెళ్లేందుకు అనుమతివ్వాలని ఏపీ పోలీసులను కోరారు. దీనికి వారు ససేమిరా అన్నారు. చేసేదిలేక అక్కడే ఉండిపోయారు. స్వాములు చిక్కుకుపోయిన విషయాన్ని మల్లేశ్వరం సర్పంచ్ తిరుపాటి నాగరాజు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే బీరం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కర్నూల్ ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్కు ఫోన్ చేసి విషయాన్ని వివరించారు. దీంతో ఎస్పీ.. పోలీసుల సాయంతో 50 మంది శివస్వాములను రెండు మరబోట్లలో సంగమేశ్వర ఆలయానికి చేర్చారు.