హైదరాబాద్ : కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను ఓపెన్ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నింటినీ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. పాఠశాల యాజమాన్యాలు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు.
కరోనా ఉధృతి కారణంగా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు జనవరి 30వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు పొడిగించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి సెలవులను జనవరి 8 నుంచి 16వ తేదీ వరకు ప్రకటించారు. అయితే ఆ సమయంలో కరోనా కేసులు పెరగడంలో సెలవులను మరోసారి పొడిగించారు. జనవరి 30వ తేదీ వరకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో, విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. మొత్తంగా కరోనా కేసులు తగ్గుతుండటంతో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలను రీ ఓపెన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.