హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పథకాలను దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు కోసం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈనెల 21న కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పీ ప్రసాద్తో తెలంగాణ రాష్ట్ర పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు సమావేశం కానున్నారు. తెలంగాణలో అమలు జరుగుతున్న రైతుబంధు, రైతుబీమాతో పాటు కాళేశ్వరం వంటి సాగునీటి పథకాలను అమలు చేయాలని, ఇప్పటికే తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల సీఎంలను కోటపాటి కలిసి విజ్ఞప్తి చేశారు.
ఆయా రాష్ట్రాల రైతుల సంఘాలతో సమావేశాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కేరళలోనూ తెలంగాణ పథకాలను అమలు చేయాలని తిరువనంతపురం వెళ్లనున్నారు. కోటపాటి నరసింహం నాయుడు వెంట ఖమ్మం జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, ఉత్తరాంధ్ర కేసీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు గాడి శివకృష్ణారావు కేరళకు వెళ్తున్నారు. 21న ముందుగా దక్షిణ భారత రైతు సంఘాలు నాయకులు పీకే దైవశిగామని, ఏఎస్ బాబు, కేఎం రామగొండర్ (తమిళనాడు), కే శాంతకుమార్ (కర్నాటక) పీటీ జాన్, కేవీ బిజూ (కేరళ) రాష్ట్రాల ప్రతినిధులతో కలిసి కేరళ వ్యవసాయశాఖ మంత్రిని కలిసి వినతిపత్రం అందజేయనున్నారు.