హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ అబిడ్స్లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో బుధ, గురువారాల్లో భారత జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య సభలు నిర్వహించనున్నట్టు జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలిరోజైన బుధవారం ఉదయం 10 గంటలకు డాక్టర్ బాలా శ్రీనివాసమూర్తి, డాక్టర్ రవ్వా శ్రీహరి స్మారక ప్రాంగణంలో జరిగే ప్రారంభ సమావేశానికి అతిథులుగా భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, నందిని సిధారెడ్డి, నమస్తే తెలంగాణ ఎడిటర్ కృష్ణమూర్తి తిగుళ్ల, ప్రముఖ కవి డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డితో పాటు పలువురు కవులు, రచయితలు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య ఎన్ గోపికి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురస్కారం-2023ను అందజేయనున్నట్టు తెలిపారు. మలిరోజు సభలకు అతిథులుగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హాజరవుతారని పేర్కొన్నారు.