హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): రైతు సంక్షేమ విధానాలను అమలు చేయటంలో తెలంగాణ ప్రభుత్వం యావత్ దేశానికే రోల్ మాడల్గా నిలుస్తున్నదని రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ టికాయత్ కొనియాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. శనివారం చండీగఢ్లో నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు.
అమర రైతు కుటుంబాలను ఆదుకొనేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా రావటంపై హర్షం వ్యక్తం చేశారు. అందుకు కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ రైతుల పక్షపాతి అని, రైతు పోరాటాలకు ఆది నుంచీ బాసటగా నిలుస్తున్నారని కొనియాడారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు, పంట పెట్టుబడి సాయం, రైతు బీమా తదితర ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టి, రైతుల సంక్షేమానికి పాటు పడుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో పంట మద్దతు ధర కోసం కేంద్రంపై పోరాటం ఉధృతం చేస్తామని, అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులను కలిసి మద్దతు కోరుతామని పేర్కొన్నారు.
తెలంగాణ జిందాబాద్.. మోదీ ముర్దాబాద్
చండీగఢ్లో రైతు కుటుంబాలకు చెక్కులను అందజేసిన సభా ప్రాంగణం ‘తెలంగాణ జిందాబాద్- మోదీ ముర్దాబాద్’ నినాదాలతో మార్మోగింది. చెక్కులను అందుకొనేందుకు వచ్చిన పలువురు రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం తర్వాత ఉద్వేగానికి గురయ్యారు. కేసీఆర్ ప్రసంగం ముగిసిన వెంటనే లేచి తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ జిందాబాద్-మోదీ సర్కార్ ముర్దాబాద్’ అంటూ నినాదాలు చేశారు. వారితో సభకు విచ్చేసిన వారంతా గొంతు కలిపి ముక్తకంఠంతో నినదించారు.