Minister Jagadish Reddy | తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం విషయంలోనూ దేశానికే రోల్ మోడల్ అని విద్యుత్ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా జర్నలిస్టుల కోసం నిర్వహించిన శిక్షణా తరగతుల ముంగింపు కార్యక్రమాన్ని ఎస్వీ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, జూలూరీ గౌరీ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.
సమగ్రమైన సమాచారంతో, వాస్తవికతతో కూడిన వార్తలకు ఆదరణ, గుర్తింపు లభిస్తుందన్నారు. జర్నలిజం ఉద్యోగం కాదని, సామాజిక బాధ్యత అన్న మంత్రి, వృత్తికి సామాజిక బాధ్యత తోడైతే అద్భుతాలు చేయవచ్చని అన్నారు. ఉమ్మడి ఏపీలో 7వేల అక్రిడిటేషన్ కార్డులుంటే తెలంగాణలో 20వేల మంది జర్నలిస్టులకు జారీ చేసినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించినందున సీఎం కేసీఆర్ ప్రెస్ అకాడమీకి రూ.42 కోట్లు సంక్షేమ నిధులు ఇచ్చారని తెలిపారు. 90శాతం జర్నలిస్టులు మధ్యతరగతి, ఆర్థిక స్థోమత లేని వారు ఉన్నందున సీఎం దృష్టికి తీసుకెళ్లి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పని చేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందని, అప్పుడే జర్నలిస్టులకు గౌరవం పెరుగుతుందని చెప్పారు. సామాజిక మార్పునకు నాంది జర్నలిస్టులు అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మేలు కొలుపుగా వార్తలుండాలని మంత్రి కోరారు. అనుకూల, ప్రతికూల వార్తలలో స్పష్టత అవసరం అన్న మంత్రి, తప్పు చేస్తే నన్ను కూడా వదలవద్దు అని సూచించారు. విమర్శలు కూడా స్వీకరించే పద్ధతిలో వార్తలు ఉండాలని కోరారు. ప్రస్తుతం దేశంలో వార్తలు వార్తలుగా వచ్చే పరిస్థితులు లేవన్నారు. సమాజాన్ని నాశనం చేస్తున్న వినాశక శక్తుల చేతుల్లో జాతీయ మాడియా ఉందని, దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందన్నారు. జర్నలిజం చీకటి రోజుల్లో మగ్గుతుందని, మీడియాను అణచివేస్తే అని అనుకుంటే వారి కంటే మూర్ఖులు సమాజంలో ఎవరూ ఉండరన్నారు.
2014లో ఆకలి కేకలు, అత్మహత్యలతో విలవిలలాడిన తెలంగాణను అన్నపూర్ణగా మార్చింది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమని, మోదీ ప్రభుత్వం హయాంలో 33శాతం మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని పేర్కొన్నారు. మోదీ పాలనలో దేశంలో దారిద్య్రం తాండవిస్తుందన్న మంత్రి, ఎగువన ఉన్న ఆర్థిక ప్రగతి సూచీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల కంటే హీనంగా మారిందన్నారు. మోదీ వైఫల్యాన్ని ఎండగట్టడంలో ప్రతి పక్షంగా కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు. వాస్తవాలను బయటకు తేలువకుండా మీడియాను చెప్పుచేతల్లో ఉంచుకున్న మోదీ దేశ చరిత్రలో అతి బలహీన ప్రధాని అంటూ విమర్శించారు. సామాజిక సేవలో సూర్యాపేట జర్నలిస్టులు ముందుంటారని మంత్రి ప్రశంసించారు.