గ్రామస్థాయిలో ఏ సేవకు ఎంత సమయం పడుతుందో స్పష్టంచేస్తూ తెలంగాణ ప్రభుత్వం సిటిజన్ చార్టర్ను తయారుచేసి అమలుచేస్తున్నది. దీనిద్వారా ప్రజలకు నిర్దేశించిన సమయంలో సేవలు అందుతున్నాయి. ప్రజల సమస్యలకూ సత్వర పరిష్కారం దొరుకుతున్నది. ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని కేంద్రం నిర్ణయించింది.
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మరో విధానాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణ పంచాయతీల్లో అమలుచేస్తున్న సిటిజన్ చార్టర్ విధానాన్ని అన్నిరాష్ట్రాలు అనుసరించాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సూచించింది. ఇందుకోసం జూలై 1 నుంచి ఆగస్టు 15 దాకా ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. ఆగస్టు 15 కల్లా ప్రతి పంచాయతీలో సిటిజన్ చార్టర్ తయారుచేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల పంచాయతీ అధికారులకు జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్డీ) మంగళవారం ఆన్లైన్లో ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. గ్రామస్థాయిలో ఏ సేవకు ఎంత సమయం పడుతుందో స్పష్టంచేస్తూ తెలంగాణ ప్రభుత్వం సిటిజన్ చార్టర్ను తయారుచేసి అమలుచేస్తున్నది. దీనిద్వారా ప్రజలకు నిర్దేశించిన సమయంలో సేవలు అందుతున్నాయి. ప్రజల సమస్యలకూ సత్వర పరిష్కారం దొరుకుతున్నది. ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విధానంలో ప్రజలకు వారు ఎన్నుకున్న పాలకవర్గాలు, అధికారులు జవాబుదారీగా ఉంటారని, పారదర్శకంగా వ్యవహరిస్తారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. జూలై 1 నుంచి ఆగస్టు 15 వరకు ఓరియెంటేషన్ కార్యక్రమానికి ఆయా రాష్ట్రాల్లోని పంచాయతీరాజ్ అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని ఎన్ఐఆర్డీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ నరేంద్రకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఐఆర్డీ రూపొందించిన ఫెసిలిటేటర్స్ ట్రైనింగ్ మాడ్యూల్ను విడుదల చేశారు. కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్శాఖ సంయుక్త కార్యదర్శి ఆలోక్ ప్రేమ్నగర్, ఎన్ఐఆర్డీ డిప్యూటీ డైరెక్టర్ జనరల రాధిక రస్తోగి, ఎన్ఐఆర్డీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కతిరిసేన్ తదితరులు పాల్గొన్నారు.