హైదరాబాద్: కొత్తగా నిర్మితమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ భవనానికి సంబంధించిన ఏసీ ప్లాంట్ను రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొత్తం సచివాలయ భవనానికి ఎయిర్ కండిషనింగ్ సౌకర్యాన్ని అందించడానికి 540 టన్నుల సామర్థ్య గల నాలుగు ఏసీ ప్లాంట్లు (3 వర్కింగ్ & 1 స్టాండ్ బై) ఏర్పాటు చేయబడ్డాయని తెలిపారు.
ఈ ఏసీ ప్లాంట్లు అధిక సామర్థ్యం గల చిల్లర్లను కలిగి ఉంటాయని, విద్యుత్ ఆదా చేసేందుకుగాను అత్యాధునిక టెక్నాలజీ కలిగిన చిల్లర్స్ VFD పంపులతో అమర్చబడ్డాయని మంత్రి వెల్లడించారు. ఏసీ ప్లాంట్ ప్రారంభం అనంతరం సెక్రటేరియట్ ఫినిషింగ్ పనులపై అధికారులు, ఏజెన్సీతో మంత్రి అక్కడే సమీక్ష నిర్వహించారు.
సీఎం కేసీఆర్ నిర్ణయించిన సచివాలయ ప్రారంభోత్సవ తేది సమీపిస్తున్న నేపథ్యంలో పనుల్లో వేగం పెంచి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను, వర్క్ ఏజెన్సీని మంత్రి ఆదేశించారు. మంత్రితోపాటు ఎస్ఈ లింగారెడ్డి, సత్యనారాయణ, ఈఈ శశిధర్, సీఈ మోహన్ నాయక్, పలువురు అధికారులు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు ఉన్నారు.