హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంచనాలకు, క్షేత్రస్థాయిలో వస్తున్న రాబడులకు అసలు పొంతన కుదరడం లేదు. ఆదాయ మార్గాలు మూసుకొనిపోతుంటే, అప్పుల వేట మాత్రం జోరుగా సాగుతున్నది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) మే నెల నివేదిక గురువారం విడుదల చేసింది. ఈ గణాంకాలు రాష్ట్రంలో ఆర్థిక డొల్లతనాన్ని ఆవిషరించాయి. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.2,41, 263.59 కోట్ల రెవెన్యూ రాబడులు సాధించాలని బడ్జెట్లో ఆశించగా, మే నాటికి వచ్చింది రూ.28,441.63 కోట్లు (11.7%) మాత్రమే. పన్నేతర ఆదాయం దారుణంగా పడిపోయింది. రూ.35,730.20 కోట్లు వస్తుందని అంచనా వేస్తే, రూ.1,803.38 కోట్లు (5.05%) మాత్రమే వచ్చింది. భూముల అమ్మకాలు దాదాపు శూన్యంగా నమోదయ్యాయి. ల్యాండ్ రెవెన్యూ ద్వారా రూ.11.15 కోట్లు వస్తాయని ఆశిస్తే.. మే నాటికి రూ.0.19 కోట్లు మాత్రమే సమకూరాయి. అంటే 1.7% మాత్రమే ఖజానాకు చేరాయి.
ఆర్థిక నిర్వహణ లోపభూయిష్టంగా మారడంతో మిగులు పోయి లోటు మిగిలింది. బడ్జెట్లో రూ.6,857.76 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని సర్కార్ గొప్పగా ప్రకటించింది. కానీ, కాగ్ నివేదిక ఆ బండారాన్ని బద్దలు కొట్టింది. మే నాటికి మిగులు సంగతి దేవుడెరుగు ఏకంగా రూ.-5,038.34 కోట్ల భారీ లోటుగా మారింది. అంటే రోజువారీ ప్రభుత్వ ఖర్చులను వెళ్లదీయడానికి కూడా ఖజానాలో పైసల్లేవు. అలాగే ద్రవ్యలోటు మే నాటికే రూ.-10,595.98 కోట్లకు చేరింది. ఇది వార్షిక బడ్జెట్ అంచనాలో 18.13 శాతానికి సమానం. రాష్ర్టానికి వస్తున్న ఆదాయానికి, చేస్తున్న వ్యయానికి పొంతన కుదరకపోవడంతో ఆ గ్యాప్ను పూడ్చడానికి సరార్ అప్పులపైనే ఆధారపడుతున్నది. మే ముగిసే నాటికే రూ.10,595.98 కోట్ల (18.13%) కొత్త అప్పులు తెచ్చింది.
ఆదాయం రాకపోయినా విచ్చలవిడి ఖర్చులు మాత్రం తగ్గడం లేదు. వచ్చిన కొద్దిపాటి ఆదాయం జీతాలు, (రూ.8,324.21 కోట్లు), పెన్షన్లు (రూ.4,758.64 కోట్లు)కే సరిపోతున్నది. ఫలితంగా అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడుతున్నది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూ.3,932.36 కోట్లు (8.32%) మాత్రమే ఉండటం గమనార్హం. అంటే సంక్షేమం, జీతాలకే నిధులు సరిపోతుండటంతో శాశ్వత అభివృద్ధి పనులకు బ్రేకులు పడ్డాయి. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు, రోడ్లు, మౌలిక వసతుల కల్పన వంటి అభివృద్ధి పనులకు పెట్టే పెట్టుబడి పూర్తిగా అట్టడుగుకు పడిపోయింది. బడ్జెట్ లెకలు కాగితాలకే పరిమితమై, ఆచరణలో తెలంగాణ అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నదని కాగ్ నివేదిక స్పష్టంచేస్తున్నది. ఆదాయ మార్గాలను పెంచుకోకుండా కేవలం అప్పులపైనే ఆధారపడితే మున్ముందు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడటం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
