హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): సాయుధ బలగాలతో నాగార్జునసాగర్ డ్యామ్ను ఏపీ ప్రభుత్వం ఆక్రమించడం అప్రజాస్వామిక చర్య అని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం మండిపడింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు మేరెడ్డి శ్యాంప్రసాద్రెడ్డి, ప్రధాన కార్యదర్శి తన్నీరు వెంకటేశం శుక్రవారం ఒక ప్రకటనలో ఏపీ చర్యను తీవ్రంగా ఖండించారు. పునర్విభజన చట్టాన్ని ఏపీ ఉల్లంఘించిందని విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు ఎన్నికల పనిలో నిమగ్నమై ఉండగా, అర్ధరాత్రి దౌర్జన్యంగా, అక్రమంగా నీటిని తరలించడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం, కేఆర్ఎంబీ చొరవ తీసుకొని నాగార్జునసాగర్ డ్యాం మీద మోహరించి ఉన్న పోలీసు బలగాలను వెంటనే ఉపసంహరించుకునేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి సమస్యను పరిషరించాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.