ధర్మపురి(జగిత్యాల) : ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన దక్షతతో రాష్ట్రంలోని జలశయాలు నిండుకుండలా దర్శనమిస్తున్నాయని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా ధర్మపురి ఎస్ హెచ్ గార్డెన్ లో నిర్వహించిన సాగునీటి దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మంత్రి మాట్లాడారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీరు, కరెంటు లేక వ్యవసాయం చేసే పరిస్థితి దారుణంగా ఉండేదని అన్నారు. వ్యవసాయంపై నమ్మకం లేక బతుకు తెరువు కోసం వలసలు వెళ్లారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల నిర్మాణంతో ప్రతి గ్రామంలో చెరువులు జలకళను సంతరించుకున్నాయని పేర్కొన్నారు. ధర్మపురిలోని చింతామణి చెరువును రూ.1.30 కోట్ల తో మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేసుకున్నామని వివరించారు. రూ. 60.80 కోట్లతో అక్కంపల్లి ఎత్తిపోతల పథకం, 4.83 కోట్లతో దొంతపూర్ ఎత్తిపోతల పథకం పనులు పూర్తి అయ్యాయని తెలిపారు
ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టిన సాగునీటి పథకాల వివరాలను వెల్లడించారు. నియోజకవర్గంలో గతంలో లక్షా 26 వేల ఎకరాలకు సాగు నీటిని అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. సాగునీరు రంగంలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు మంత్రి శాలువా తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, అడిషనల్ కలెక్టర్ లత, జడ్పీటీసీలు బాదినేని రాజేందర్, బత్తిని అరుణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యోరి రాజేష్,అధికారులు పాల్గొన్నారు.