హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నది. శుక్రవారం 58,029 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 495 మందికి పాజిటివ్గా తేలినట్టు శనివారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ స్పష్టంచేసింది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 142, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 45, రంగారెడ్డిలో 35, నిజామాబాద్లో 30, నల్లగొండలో 21, సంగారెడ్డిలో 20, మహబూబ్నగర్లో 18, కరీంనగర్లో 16, ఖమ్మంలో 15 కేసులు వెలుగుచూశాయి.
37 వేల మందికి వ్యాక్సిన్
రెండోదశ వ్యాక్సినేషన్లో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 37,115 మంది తొలిడోస్ తీసుకున్నారు. 3,208 మంది రెండోడోసు వేసుకున్నారు. దీంతో ఇప్పటివరకు తొలిడోస్ తీసుకున్నవారి సంఖ్య 8.91 లక్షలకు చేరగా, రెండు డోసులు తీసుకున్నవారి సంఖ్య 2.33 లక్షలకు చేరింది. రాష్ట్రంలో వ్యాక్సిన్ వృథా కేవలం 0.74 శాతం మాత్రమే ఉన్నదని, దేశంలోనే ఇది అత్యల్పమని శనివారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది.
యాదాద్రిలో ఆర్జిత సేవలు రద్దు
యాదాద్రి, మార్చి 27: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలోని బాలాలయంలో భక్తులతో నిర్వహించే ఆర్జిత సేవలను ఆదివారం నుంచి మూడ్రోజులపాటు రద్దుచేస్తున్నట్టు ఈవో గీత తెలిపారు. ఆలయంలోని అర్చకులు, అధికారులు, సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ నెల 30 వరకు స్వామివారి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, సత్యనారాయణ వ్రతాలతోపాటు భక్తుల కోసం ఏర్పాటు చేసే నిత్యాన్నదానాన్ని కూడా నిలిపివేస్తున్నట్టు చెప్పారు.