హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్నది. రోజువారీ కేసుల సంఖ్య ఐదువందలకు చేరువైంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 494 మందికి పాజిటివ్గా తేలింది. పాజిటివిటీ రేటు సైతం 1.71 శాతానికి పెరిగింది. హైదరాబాద్ జిల్లాలో 315 కేసులు నమోదయ్యాయి. గురువారం నమోదైన కేసుల్లో 90 శాతం కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3వేలు దాటింది. అత్యధికంగా హైదరాబాద్లో 315, రంగారెడ్డిలో 102, మేడ్చల్ మల్కాజిగిరిలో 31, సంగారెడ్డిలో 11 కేసులు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం తదితర కొవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.