హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,319 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,275 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 474 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18,339 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
ఇవాళ 90,021 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 7 లక్షల 94 కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ఇప్పటి వరకు 4,047 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఒక్కరోజే 2.51 లక్షల మందికి కొవిడ్ టీకాలు వేయగా, 36,691 మంది కొవిడ్ బూస్టర్ డోసు వేసుకున్నారు.