Satish Reddy | దేశంలో బీజేపీ పనైపోయిందని మరోసారి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్న ఆవేదన, ఫ్రస్టేషన్లోనే కేంద్ర హోంమంత్రి అమిత్షా.. ఆదివారం చేవెళ్లలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారని తెలంగాణ పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ వై సతీశ్ రెడ్డి అన్నారు. పేపర్ లీకేజీలపై అమిత్ షా మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలపై ఆ ప్రభుత్వాలు ఏం విచారణ జరిపించాయో అమిత్ షా చెప్పాలని డిమాండ్ చేశారు.
`దశాబ్దాలుగా బీజేపీ అధికారంలో ఉన్న ప్రధాన నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్లో 10 ఏండ్లలో 15 పోటీ పరీక్షా పేపర్ లీకేజీలు జరిగాయి. గత ఎనిమిదేళ్లలో నిర్వహించిన అన్ని పోటీ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి. అభ్యర్థులు ఒకరికి బదులు మరొకరితో పరీక్షలు రాయించారు. అయినా అక్కడ పట్టించుకునే నాథుడు లేడు. గుజరాత్లో ఎన్నిసార్లు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించారు తడిపార్ అమిత్ షా..? బీజేపీ పాలనలో మొత్తం 118 సార్లు పేపర్ లీకేజీలు జరిగాయి. వీటిలో ఎన్నింటిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించారు? మధ్యప్రదేశ్లో వ్యాపం స్కామ్ తో అనేకమందిని పొట్టన పెట్టుకున్నారు. సాక్షులు, కేసు విచారించిన వాళ్ళు కూడా అనుమానస్పదంగా మరణించారు. దీని గురించి ఎందుకు మాట్లాడవు తడిపార్ అమిత్ షా? ` అని సతీశ్ రెడ్డి ప్రశ్నించారు.
`కానీ తెలంగాణలో పేపర్ లీకేజీ జరిగినట్టుగా ప్రభుత్వమే గుర్తించి దర్యాప్తుకు ఆదేశించింది. నిందితులను అరెస్టు చేసింది. ఇంకా విచారణ కొనసాగుతున్నది. ఏ విచారణకైనా సిద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. నేరాలు చేయడం తప్పించుకు తిరగడం.. అడ్డదారుల్లో కేసుల నుంచి బయటపడటం మీకు అలవాటు. మారణహోమం సృష్టించి రాష్ట్ర బహిష్కరణకు గురైన అమిత్ షా తెలంగాణకు వచ్చి నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. బిల్కిస్ బానో పై దారుణంగా లైంగిక దాడి చేసి.. వారి కుటుంబ సభ్యులను హత్య చేసిన నిందితులను జైలు నుంచి విడిపించిన దుర్మార్గులు మీరు. బయటకు వచ్చాక వారేదో జాతి కోసం జైలుకు వెళ్ళినట్టుగా సన్మానాలు చేసింది మీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ దుర్మార్గులు. అలాంటి మీరు వచ్చి ప్రపంచం మెచ్చేలా సుపరిపాలన అందిస్తున్న తెలంగాణపై విమర్శలు చేయడం ఆకాశంపై ఉమ్మి వేయడం లాంటిదే అవుతుంది` అని సతీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు.
`పదో తరగతి పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని తప్పుడు ప్రచారం చేసి పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడి సర్కారును అస్థిరపరచాలని చూసిన దుర్మార్గుడు బండి సంజయ్.. అలాంటోడిని రాష్ట్ర బహిష్కరణకు గురైన తడిపార్ అమిత్ షా వెనకేసుకొస్తున్నారు. ఎంత పెద్ద తప్పు చేసినా జైలు నుంచి తాము బెయిల్ తో బయటకు వస్తామన్నట్టుగా చేవెళ్ల సభలో అమిత్ షా మాట్లాడారు. బండి సంజయ్ ని తెలంగాణ సర్కారు 24 గంటలు కూడా జైల్లో పెట్టలేకపోయిందని బెయిల్పై బయటకు తీసుకొచ్చామని అమిత్ షా మాట్లాడటం బట్టి చూస్తే స్వతంత్రంగా పనిచేయాల్సిన న్యాయ వ్యవస్థపై కూడా అనుమాన పడాల్సి వస్తున్నది` అని సతీశ్ రెడ్డి పేర్కొన్నారు.
`మీరు మీ రాష్ట్రాల్లో చేస్తున్న అరాచకాలు తెలంగాణలో జరుగుతున్నట్లు చూపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడి ప్రజలు నమ్మరు. వాస్తవం ఏంటో.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి ఏంటో.. సంక్షేమం ఏంటో.. ప్రజలకు తెలుసు. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న నికృష్ట పాలనను కూడా మా తెలంగాణ ప్రజలు గమనిస్తునారు. ప్లీజ్ అధికారం ఇవ్వండని మీరు ఎంత బతిమిలాడినా.. కాళ్ళా వేళ్ళా పడ్డా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సాష్టాంగ నమస్కారాలు చేసినా.. మీ దుర్మార్గ పాలనను ఏ ఒక్క పౌరుడు కోరుకోడు. మిమ్మల్ని తెలంగాణ పొలిమేరలోనే పాతి పెట్టడం పక్కా` అని స్పష్టం చేశారు.