హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 3,557 కొత్త కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృత్యువాత పడ్డారు. రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య 24 వేలు దాటింది. 1,773 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 2.71 లక్షల మందికి టీకాలు వేశారు. ఇందులో 66 వేల మందికి మొదటి డోస్, 1.91 లక్షల మందికి రెండో డోస్, దాదాపు 13 వేల మందికి బూస్టర్ డోస్ వేశారు. బుధవారంతో రాష్ట్రంలో పంపిణీ చేసిన డోసుల సంఖ్య 5.12 కోట్లుగా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13.02 లక్షల డోసులు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్లో కలిపి 53,722 పడకలు అందుబాటులో ఉన్నాయి.