Telangana | హైదరాబాద్ : మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ మతిభ్రమించినట్టుగా మాట్లాడుతున్నారని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన ఆయన.. ఇప్పుడు అదే ప్రభుత్వ ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి గుదిబండ అంటూ ఆయన మాట్లాడిన తీరు.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరి మానసిక స్థైర్యాన్ని దెబ్బతిసేలా ఉందని దుయ్యబట్టారు. అంటే.. జయప్రకాశ్ నారాయణ కూడా గతంలో ప్రభుత్వానికి గుదిబండ గానే ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సరికాదు.. అవసరమైతే పూర్తిగా ఎత్తేయాలని.. ఎవరో ఒకరు బస్సులు నడిపిస్తారని మాట్లాడిన తీరు.. ఆయన స్థాయిని దిగజార్చుకోవడమే అవుతుందన్నారు. ఉద్యోగ భద్రత లేక దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ మానవీయ కోణంతో భరోసా కల్పించారని ఆయన చెప్పారు. దీన్ని జయప్రకాశ్ నారాయణ అర్థం చేసుకోలేకపోతున్నారన్నారు. ఈ నిర్ణయాన్ని అసలు ఆయన ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారని ప్రశ్నించారు.
ప్రజలు, ఉద్యోగులు అందరూ కూడా ప్రభుత్వంలో భాగస్వాములేనని.. అందరు కష్టపడుతున్నారు కాబట్టే నేడు తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలో అగ్రభాగాన ఉందన్నారు సతీష్ రెడ్డి. 9 ఏళ్లలోనే అనేక అద్భుతాలు చేసి చూపించి.. ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిందన్నారు. కానీ.. జయప్రకాశ్ నారాయణ పూర్తిగా చంద్రబాబు, మోదీ చెప్పుచేతల్లో ఉన్నట్టుగా, వారి ఆలోచనా విధానంతోనే మాట్లాడుతున్నాట్టుగా అనిపిస్తోందన్నారు. అందుకే ఆర్టీసీని పూర్తిగా ఎత్తేసి ప్రైవేటు ఆపరేటర్లకు బస్సులు అప్పజెప్పాలన్నట్టుగా ఆయన మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ లాగా ప్రభుత్వ రంగ సంస్థలన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మరీ ముఖ్యంగా అంబానీ, అదానీల చేతుల్లో పెట్టేస్తే జయప్రకాశ్ నారాయణకు సంతోషంగా ఉండేదా అని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీ ఉద్యోగులను, రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులను కించపరిచేలా, వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన జయప్రకాశ్ నారాయణ వెంటనే వారికి క్షమాపణలు చెప్పాలని సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యోగులే ఆయనకు తగిన బుద్ధి చెబుతారని సతీష్ రెడ్డి హెచ్చరించారు.