హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా పంజా విసిరింది. 24 గంటల్లోనే కేసులు, పాజిటివిటీ రేటు రెట్టింపయ్యాయి. సోమవారం 482 కేసులు నమోదుకాగా.. మంగళవారం ఏకంగా 1,052 మందికి కొవిడ్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. పాజిటివిటీ రేటు 1.2 శాతం నుంచి 2.4 శాతానికి పెరిగింది. జిల్లాల్లో కాస్త అదుపులోనే ఉన్నా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో పరిస్థితి తీవ్రమవుతున్నది. మంగళవారం జీహెచ్ఎంసీ పరిధిలో ఏకంగా 659 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరిలో 116, రంగారెడ్డిలో 109 మందికి పాజిటివ్గా తేలింది. నమోదైన మొత్తం కేసుల్లో ఏకంగా 84 శాతం ఈ మూడు జిల్లాల్లోనే వెలుగు చూశాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మహబూబాబాద్ జిల్లా కురవి ఏకలవ్య గిరిజన బాలికల గురుకుల కళాశాల, పాఠశాలలో సోమవారం ఆరుగురికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. నల్లగొండ జిల్లా చింతపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు, ఇద్దరు ఉపాధ్యాయులకు వైరస్ సోకింది. ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 94కు పెరిగింది. హైదరాబాద్ విమానాశ్రయంలో విదేశీ ప్రయాణికులకు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో 16 మందికి పాజిటివ్గా తేలింది. వీరి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. మంగళవారం 2.95 లక్షల మందికి టీకాలు వేశారు. ఇందులో 1.05 లక్షల మందికి మొదటిడోస్ వేయగా, వీరిలో 15- 18 ఏండ్ల వారికి 60,720 డోసులు వేశారు. 1.90 లక్షల మందికి రెండో డోస్ వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33.84 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ సూళ్లలోని విద్యార్థుల ఆరోగ్యంపై ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఆలోపే 15 నుంచి 18 ఏండ్ల విద్యార్థులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టంచేశారు.