హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రవాస తెలంగాణీయులున్న ప్రతీ దేశంలో అవతరణ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకొన్నారు. టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల నేతృత్వంలో వివిధ దేశాల్లో టీఆర్ఎస్ ఎన్నారై కార్యకర్తలు వేడుకలు నిర్వహించారు.
టీఆర్ఎస్ ఎన్నారై సెల్, టాక్ సంయుక్తంగా నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో ప్రవాస తెలంగాణీయులు పెద్దఎత్తున పాల్గొన్నారు. గురువారం హౌంస్లోలో టాక్ ప్రధాన కార్యదర్శి సురేశ్ బుడుగం అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో.. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుపుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టాక్ ప్రతినిధులు శుశుమనరెడ్డి, సత్య చిలుముల, మట్టారెడ్డి, నాయకులు మల్లారెడ్డి , సత్యపాల్, శ్రావ్య, సుప్రజ, స్వాతి బుడుగం, రవి రేటినేని, నవీన్ భువనగిరి, రవి ప్రదీప్, అబూ జాఫర్, సృజన్రెడ్డి, ప్రశాంత్, సురేష్ గోపతి, హరి నవాబ్పేట్, మణితేజ, నిఖిల్, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
బహ్రెయిన్లో టీఆర్ఎస్ ఎన్నారైసెల్ ప్రధాన కార్యదర్శి పుప్పాల లింబాద్రి అధ్యక్షతన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ ఎన్నారై సెల్ అధ్యక్షులు రాధారపు సతీశ్ కుమార్, ఉపాధ్యక్షులు వెంకటేశ్ బొలిశెట్టి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు విజయపథంలో ముందుకు సాగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వెంకటేశ్ బొలిశెట్టి, కార్యదర్శులు సంగెపు దేవన్న, చెన్నమనేని రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.