హైదరాబాద్ : కొత్తగూడెం పట్టణంలో చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో తాను చేసిన వ్యాఖ్యలు మీడియాలో దుమారం రేగడంతో తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్రావు ఒక ప్రకటన విడుదల చేశారు.
దయచేసి నా వ్యాఖ్యలను వక్రీకరించొద్దని మీడియా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. కొన్ని మీడియా సంస్థల వారు నా ప్రసంగంలోని కొంత భాగాన్ని కట్ చేసి, వివాదాన్ని సృష్టించడం నన్ను తీవ్రంగా కలచివేసింది. కేవలం క్రీస్తు ద్వారానే కరోనా సమసిపోయింది అని నేను అన్నట్టు అర్థం వచ్చేలా నా వీడియో క్లిప్ కట్ చేసి ప్లే చేస్తున్నారు. ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అని శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో, ప్రభుత్వ పనితీరు వల్ల, ఆరోగ్య శాఖలోని పై స్థాయి నుండి కింద స్థాయి ఉద్యోగుల సంపూర్ణ సహకారం వల్ల, అన్ని మతాలకు చెందిన వారు.. వారి వారి దేవతామూర్తులను ప్రార్థించుట వలనే కరోనా సమసిపోయిందని నేను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి, తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరం. నేను ఏ మతాన్ని, ఎవరి నమ్మకాలనూ కించపరచను. అన్ని మతాలను ఒకే రకంగా చూస్తాను. సర్వమతాల సారం ఒక్కటే అని నమ్ముతాను. దయచేసి యూట్యూబ్లో ఉన్న ఫుల్ వీడియో చూడాలని కోరుతున్నాను అని డాక్టర్ శ్రీనివాస్ రావు సూచించారు.