జహీరాబాద్ : చెరుకుకు ప్రత్యామ్నాయంగా పరిశోధనలు చేసి షుగర్ బీట్ (చక్కెర దుంప-Sugar beet ) నూతన వంగడాన్ని అభివృద్ధి చేసిన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం బసంత్పూర్ ప్రొఫెసర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్ ( Doctor Vijay kumar) కు అరుదైన గౌరవం లభించింది.
శుక్రవారం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పట్టణంలో సౌత్ ఇండియన్ షుగర్ కేన్ అండ్ షుగర్ టెక్నాలజిస్ట్ అసోసియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్ను టెక్నాలజీస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నప్పన్ ఉత్తమ బంగారు పతకం(Gold medal ) తోపాటు ప్రశంస పత్రాన్ని అందజేశారు. దక్షిణ భారతదేశంలోని పాండిచ్చేరి, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన చెరుకు శాస్త్రవేత్తలు చెరుకు పంట సాగులో నూతన వంగడాలు అభివృద్ధి చేసేందుకు చేసిన పరిశోధనలను గుర్తించి వారికి ఉత్తమ పురస్కారాలను అందజేస్తున్నారు.
ఇందులో భాగంగా మన రాష్ట్రానికి చెందిన డాక్టర్ విజయకుమార్ షుగర్ బిట్ నూతన వంగడానికి బంగారు పతకాన్ని అందజేసి సత్కరించారు. బంగారు పథకం అందుకోవడం సంతోషంగా ఉందని, తనపై బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో చెరుకు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన వంగడాలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని విజయకుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యూఢిల్లీ చెందిన షుగర్ టెక్నాలజీస్ట్ అసోసియేషన్ చైర్మన్ సుజిత్ అవస్థన్, ఆయా రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తలు, తదితరులు పాల్గొన్నారు.