నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 30 : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్తు ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీవీఏఈ జేఏసీ) ఆధ్వర్యంలో ఆర్టిజన్ కార్మికులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగారు. కరీంనగర్లోని సర్కిల్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో రాష్ట్ర కోకన్వీనర్ చందర్ సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమ తరహాలో దశల వారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలోని సబ్స్టేషన్ ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విద్యుత్తు కార్యాలయాల ఎదుట బైఠాయించారు. కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నల్లగొండ డివిజన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, ఎల్లారెడ్డి, ఆర్మూర్ డివిజన్లలోని ట్రాన్స్కో కార్యాలయాల ఎదుట బైఠాయించారు. ఏప్రిల్ 7లోగా సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.