హైదరాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ) : యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్(వైటీపీఎస్)లోని యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్(ఏహెచ్పీ), కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్పీ)లకు సంబంధించిన ప్రైవేట్ టెండర్లను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ(టీజీపీఈ జేఏసీ) కన్వీనర్ పీ రత్నాకర్రావు, జనరల్ సెక్రటరీ మహేశ్కుమార్, వైస్ చైర్మన్ వజీర్ డిమాండ్ చేశారు. టీజీపీఈ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో.. వైటీపీఎస్లోని కీలక విభాగాలను ప్రైవేట్పరం చేయడాన్ని జేఏసీ తీవ్రంగా వ్యతిరేకించింది.
వైటీపీఎస్ను జెన్కో ఉద్యోగులతోనే నడుపాలని, ప్రైవేట్కు అప్పగించే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. భవిష్యత్తులో రామగుండం, కొత్తగూడెంలోని నూతన థర్మల్ ప్లాంట్లనూ జెన్కో ఆధ్వర్యంలోనే నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నిరసన ప్రణాళికను ప్రకటించింది. నేటి నుంచి 7వ తేదీ వరకు ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్స్ల్లోని ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపాలని నిర్ణయించింది. తదుపరి కార్యాచరణను 7న ప్రకటిస్తామని జేఏసీ నేతలు స్పష్టంచేశారు.