హైదరాబాద్ : దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇండియాలో కూడా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ఆదేశించింది. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
మాస్కు ధరించకపోతే రూ. 1,000 జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. అయినప్పటికీ పోలీసుల మాట వినిపించుకోకుండా, మాస్కు ధరించకుండా బయటకు వస్తున్న వారికి పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. మాస్కు ధరించాలని పోలీసులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మాస్కు ధరించండి.. జాగ్రత్తగా ఉండండి.. రూ. 1000 ఆదా చేసుకోవాలని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో కొవిడ్ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని ఆదేశిస్తున్నారు.