హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): కొలతలు మారేది లేదు.. అవకతవకలకు చాన్సే ఉండదు.. ప్రతి దశలోనూ పూర్తిస్థాయి సాంకేతికత వినియోగం.. ఇదీ దేహదారుఢ్య పరీక్షల్లో తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) సన్నద్ధత. పోలీస్ కొలువులకు వచ్చే నెలలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు బోర్డు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ చిన్న పొరపాటుకూ తావులేకుండా, పారదర్శకంగా ప్రక్రియ ముగిసేలా చర్యలు చేపట్టారు. బోర్డు చైర్మన్గా వీవీ శ్రీనివాస్రావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచారు. బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థుల హాజరు మొదలు ప్రక్రియ పూర్తయ్యేవరకూ అన్నింటిలోనూ సాంకేతికతను వినియోగిస్తున్నారు. పరీక్షలు జరిగే అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫుటేజ్ సర్వర్లలో ఎప్పటికప్పుడు నిక్షిప్తం అవుతుంది.
దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అడ్మిట్కార్డుల జారీ ప్రక్రియ మరో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. దేహదారుఢ్య పరీక్షల కోసం అభ్యర్థులు గ్రౌండ్లోపలికి వచ్చే ముందు బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకుంటారు. ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన, దరఖాస్తులో ఉన్న వేలిముద్రలకు సరిపోలితేనే లోపలికి అనుమతిస్తారు. గ్రౌండ్లోకి రాగానే అభ్యర్థి చేతికి రిస్ట్బ్యాండ్ వేస్తారు. దానిలో ఆర్ఎఫ్ఐడీ చిప్ ఉంటుంది. అభ్యర్థి గ్రౌండ్లో ఏ ప్రాంతంలో ఉన్నా సరే పోలీస్ సిబ్బందికి తెలిసిపోతుంది. అభ్యర్థి ఎత్తును డిజిటల్ హైట్ మీటర్ ద్వారా తీయనున్నారు. అదేవిధంగా ప్రతి అభ్యర్థికి ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) చిప్ ఉన్న బనియన్లాంటిది వేస్తారు. రన్నింగ్లో పాల్గొన్నప్పుడు ప్రారంభించిన సమయం, పూర్తి చేసిన సమయం రెండూ రికార్డ్ అవుతాయి. వాటి ఆధారంగా అభ్యర్థి ఎంత సమయంలో పరుగు పూర్తిచేశాడన్నది కంప్యూటర్లో నిక్షిప్తం అవుతుంది. లాంగ్జంప్, షాట్పుట్ అర్హత మాత్రమే కాబట్టి అందులో మెరిట్ను గణించరు. ఆ కొలతలు సైతం నేరుగా కంప్యూటర్లో నమోదు చేస్తారు. అభ్యర్థుల కొలతలు తీసేటప్పుడు మొదలు షాట్పుట్, లాంగ్ జంప్, పరుగుపందెం.. ఇలా ప్రతి దశలోనూ వారి ప్రతి కదలిక, సిబ్బంది పనితీరు సహా అంతా సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుంది.
ఈసారి ప్రయోగాత్మకంగా సీసీ కెమెరాలు, ఆర్ఎఫ్ఐడీలను సింక్రనైజ్ చేశారు. సీసీ కెమెరాలో సమయం, ఆర్ఎఫ్ఐడీ చిప్, ఆర్ఎఫ్ఐడీ రిస్ట్బ్యాండ్.. ఇలా అన్ని సమయాలు కంప్యూటర్లో నిక్షిప్తం అవుతాయి. పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు క్లౌడ్ స్టోరేజ్లోకి వెళ్తుంది. స్థానికంగా సర్వర్లలో ఎలాంటి అవకతవకలకు తావు ఉండదు. ఒకసారి రికార్డయిన డాటాను క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి బోర్డు చైర్మన్ వరకు ఎవరూ మార్పు చేయలేరు. పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఈవెంట్స్ నిర్వహణకు టీఎస్ఎల్పీఆర్బీ పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నది.