హైదరాబాద్: పిల్లలపై ఆన్లైన్ పీడనలకు సంబంధించిన సెంట్రలైజ్డ్ రిపోర్టింగ్ సిస్టమ్ TIPLINES ఆధారంగా.. తెలంగాణలోని వివిధ పోలీస్స్టేషన్లలో నమోదైన సైబర్ క్రైమ్ కేసులపై సీఐడీ ADGP మహేష్ భగవత్ ఇటీవల రాష్ట్రస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విచారణలో వివిధ దశల్లో ఉన్న మొత్తం 31 కేసులను మహేశ్ భగవత్ సమీక్షించారు. చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ (CSAM)ను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం, సర్క్యులేట్ చేయడంపై TIPLINES ప్రాథమికంగా దృష్టిసారిస్తుంది.
కాగా, సమీక్షలో చర్చకు వచ్చిన వివరాల ప్రకారం.. చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి ఇప్పటివరకు మొత్తం 43 మందిని అరెస్టు చేశారు. అయితే, సమీక్ష అనంతరం 10 కేసుల్లో 21 మందిని అరెస్టు చేయగా.. సమీక్ష సమయానికల్లా 16 కేసుల్లో 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. సమీక్ష అనంతరం మొత్తం 13 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 44 కేసులను TIPLINES ఆధారంగా నమోదు చేశారు. వాటిలో 34 కేసులు దర్యాప్తులో ఉండగా, మరో 8 (PT) కేసుల్లో నమోదైన అభియోగాలు విచారణలో ఉన్నాయి.
కేసుల విచారణను వేగవంతం చేయాలని, చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ (CSAM) కేసులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సమీక్ష సందర్భంగా ఇన్వెస్టిగేషన్ అధికారులకు ఏడీజీ మహేశ్ భగవత్ సూచించారు. CSAM కేసుల్లో త్వరితగతిన అరెస్టులు చేసి, ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను ఆయన అభినందించారు.
TIPLINES అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ద్వారా రాష్ట్ర సీఐడీకి అందిన CSAM సర్క్యులేషన్ గురించిన ఆన్లైన్ చిట్కాలు. సీఐడీ ఈ చిట్కాలను విశ్లేషించి, FIRల నమోదు కోసం సంబంధిత పోలీసులకు బదిలీ చేస్తుంది. ఈ కేసుల పురోగతి గురించి CID క్రమం తప్పకుండా సమీక్షిస్తుంది. ఈ సమావేశానికి సీసీపీఎస్ డీసీపీ స్నేహ మెహ్రా, సైబర్ క్రైమ్స్, CID అదనపు ఎస్పీ టీవీ హనుమంతరావు, సైబర్ క్రైమ్స్, CID డీఎస్పీ కే గుణశేఖర్, సైబర్ క్రైమ్స్, CID ఇన్స్పెక్టర్లు ఎం ప్రసాద్, డీ రామ కృష్ణ రెడ్డి, తెలంగాణాలోని వివిధ యూనిట్లకు చెందిన టిప్ లైన్ కేసుల దర్యాప్తు అధికారులు హాజరయ్యారు.
కాగా, సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలను అప్లోడ్ చేయడం, వాటిని సర్క్యులేట్ చేయడం IT చట్టంలోని సెక్షన్ 66 (E), 67 (A), 67 (B), IT చట్టం 2000 – 2008, POSCO చట్టం 2012లోని సెక్షన్ 13 r/w, IPC 354 (C) ప్రకారం నేరం. మొదటిసారి ఈ నేరానికి పాల్పడితే ఏడాది నుంచి మూడేండ్ల వరకు జైలుశిక్షతోపాటు జరిమానా విధిస్తారు. రెండోసారి, ఆ తర్వాత కూడా ఇలాంటి నేరాలకు పాల్పడితే మూడు నుంచి ఏడేండ్ల జైలుశిక్ష, జరిమానా ఉంటుంది. కాబట్టి ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, లేదంటే చట్టం తనపని తాను చేసుకుపోతుందని పోలీసులు హెచ్చరించారు. పదేపదే ఇలాంటి నేరాలకు పాల్పడే వారిని ముందస్తుగా నిర్బంధంలోకి తీసుకోవడం కోసం సస్పెక్ట్ షీట్స్ కూడా తెరుస్తామని హెచ్చరిక చేశారు.